మరో సారి నగరం ఖాళీ..! ఓటు బాట పట్టిన జనం.. !!
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో గురువారం ఎన్నికల పోలింగ్ ఉండటంతో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు గ్రామాలకు తరలి వెళ్తున్నారు. హైదరాబాద్ నగరంలోని బస్టాండ్లతో పాటు రైల్వే స్టేషన్ లలో ప్రజలు కిక్కిరిసిపోయారు. సాయంత్రం వేలలో భారీగా రైల్వే స్టేషన్లకు ప్రజలు రావడంతో రైళ్లలో రద్దీ పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది.
సంక్రాంతి పండగను తలపిస్తున్న జనం..! కిక్కిరిసిన బస్ స్టాండ్లు, రైల్వే ష్టేషన్లు..!!
లింగంపల్లి, సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి పండగ రోజులను తలపించే విధంగా ప్రయాణాలు సాగుతున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్లో సాయంత్రం బయలుదేరే ఫలక్నుమా, విశాఖ ఎక్స్ప్రెస్, గోదావరి ఎక్స్ప్రెస్లలో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. జనరల్ బోగీలతో సహా స్లీపర్ క్లాస్ బోగీల్లో కూడా సాధారణ ప్రయాణికులు ఎక్కేయడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
జనం అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్న ట్రావెల్స్..! విపరీతంగా పెరిగిన ఛార్జీలు..!!
కొన్ని ప్రైవేటు ట్రావెల్ సంస్థలు గతంలో రిజర్వేషన్ చేసుకున్న టికెట్లను సైతం రద్దు చేసి.. ఓట్ల పండగను సొమ్ము చేసుకుంటున్నాయి. సాధారణ రోజుల్లో విజయవాడకు 500 రూపాయల నుంచి 600 రూపాయల వరకూ ఉండే టికెట్ను రెట్టింపు చేశాయి. అలాగే విశాఖపట్నం వైపు వెళ్లే టికెట్లను 2 వేల రూపాయల నుంచి 3 వేల రూపాయల వరకూ అమ్ముకున్నాయి. ఇదే పరిస్థితి ఏలూరు, రాజమహేంద్రవరం, కాకినాడ, తిరుపతి, కర్నూలు, అనంతపురం ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లోనూ ఉంది.
అదనంగా బస్సులు..! సరిపోవడం లేదంటున్న ప్రయాణీకులు..!!
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఏపీఎస్ఆర్టీసీ రోజూ నడిపే 540 బస్సులకు అదనంగా 300 బస్సులను వేసింది. 10వ తేదీన కూడా ప్రత్యేక బస్సులను నడుపుతామని ఏపీఎస్ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం సుధాకర్ చెప్పారు. 500 బస్సులు అదనంగా నడుపుతున్నామని టీఎస్ఆర్టీసీ రంగారెడ్డి అదికారి తెలిపారు. అంతే కాకుండా తాత్కాలికంగా పలు రైళ్లకు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.
రైళ్లకు అదనపు బోగీలు..! ఇబ్బందులు లేవంటున్న అదికారులు..!!
కాచిగూడ-రేపల్లె-కాచిగూడ (నం.17625/17626) డెల్టా ఎక్స్ప్రెస్కు 30వ తేదీ వరకు అదనంగా ఒక్కో థర్డ్ ఏసీ బోగీని జతచేసింది. గుంటూరు-వికారాబాద్-గుంటూరు పల్నాడు ఎక్స్ప్రెస్కు (నం.12747/12748)కు ఒక్కో చైర్ కార్ బోగీ అందుబాటులోకి వచ్చింది. గుంటూరు-విశాఖపట్నం-గుంటూరు (నం.17239/17240) సింహాద్రి ఎక్స్ప్రెస్కు ఒక చైర్ కార్ బోగీ 15 వరకు.. విజయవాడ-లింగంపల్లి-విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ (నం.12795/12796) రెండేసి చైర్ కార్బోగీలు ఈ నెల 15వ తేదీ వరకు అందుబాటులోకి వచ్చినట్లు రైల్వే అదికారులు తెలిపారు.