ఆరునెలల్లో మూడోసారి: పోలవరం వద్ద కుంగిన భూమి: నడవడానికీ వీల్లేని విధంగా!
Recommended Video
అమరావతి: ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు వద్ద మరోసారి భూమి కుంగిపోయింది. ఆరునెలల వ్యవధిలో ఈ ప్రాజెక్టు వద్ద భూమి కుంగిపోవడం, లేదా పగుళ్లు ఏర్పడటం ఇది మూడోసారి. శనివారం మధ్యాహ్నం పోలవరం ప్రాజెక్టు సమీపంలోని 902 ఏరియాలో భూమి కుంగిపోయింది. ఆ ప్రాంతంలో రోడ్డుకు బీటలు పడ్డాయి. వాహనాలు కాదు కదా, కనీసం నడవడానికి కూడా వీల్లేని విధంగా తయారైంది అక్కడి రోడ్డు మార్గం. గత ఏడాది నవంబర్ 4వ తేదీన, ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన కూడా పోలవరం వద్ద భూమి కుంగి పోయిన విషయం తెలిసిందే.
ప్రాజెక్టు పరిసరాల్లోనే ఎందుకు?
పోలవరం ప్రాజెక్టు పరిసరాల్లోనే భూమి కుంగుబాటుకు గురి అవుతుండటం చర్చనీయాంశమైంది. దీనికి గల కారణాలు ఏమిటన్నది ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులకు తెలియదు. భూమి కుంగడానికి, రోడ్లకు పగుళ్లు ఏర్పడటానికి గల కారణాలను అధికారులు ఇప్పటిదాకా అన్వేషించనే లేదు. శాస్త్రీయ కారణాలను వెలికి తీయడంలో అధికారులు విఫలం అయ్యారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం వినియోగించే వాహనాలు రాకపోకల వల్ల భూమి కుంగుతోందంటూ గుడ్డిగా సమాధానాలను ఇస్తున్నారు. గతంలో సుమారు రెండు కిలోమీటర్ల మేర తారు రోడ్డులో పగుళ్లు ఏర్పడినప్పుడు కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. అప్పట్లో వారి వ్యవహార శైలిపై విమర్శలు వచ్చినప్పటికీ ఖాతరు చేయలేదు.
సీఎం..సీఎస్ వివాదం : పాలన గాలికి వదిలేసారా : గవర్నర్ జోక్యం తప్పదా..!
ఫిబ్రవరి 24వ తేదీన కూడా అలాంటి దృశ్యమే ప్రాజెక్టు వద్ద కనిపించింది. సంఘటనా స్థలానికి దీనికి సమీపంలోనే డంపింగ్ యార్డు ఉండటం వల్ల పగుళ్లు ఏర్పడి ఉంటాయని అంచనా వేశారు. అక్కడితో ఈ ఉదంతం గురించి మర్చేపోయారు. తాజాగా- 902 ఏరియాలో భూమి కుంగడం ఆందోళనకు దారి తీస్తోంది. ప్రాజెక్టు పనుల కోసం ఉపయోగించే క్రేన్లు, జేసీబీలు, భారీ లారీలు, ట్రక్కులు నిరంతరం ఇదే మార్గంలో తిరుగాడుతుంటాయి.
దీనికితోడు- చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు సందర్శన కార్యక్రమం కోసం రోజూ పదుల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు, వ్యక్తిగత వాహనాలు ప్రాజెక్టు వద్దకు రాకపోకలు సాగిస్తుంటాయి. ఫలితంగా- అదనపు లోడ్ ఎక్కువ కావడం వల్ల భూమి కుంగిందని, పగుళ్లు ఏర్పడ్డాయని ఫిబ్రవరి 24వ తేదీ నాటి ఘటనలో అధికారులు తమను తాము సమర్థించుకున్నారు. ఈ సారి పగుళ్లు ఏర్పడిన ప్రాంతంలో పెద్దగా వాహనాలు సంచరించకపోవడాన్ని అధికారులు ఎలా సమర్థించుకుంటారనేది వేచి చూడాలి.