మరోసారి మెగాస్టార్ మెగా పిలుపు: ప్రధాని మోడీ నిర్ణయాన్ని సమర్థించిన చిరంజీవి..!
అమరావతి: కేంద్ర మాజీమంత్రి, మెగాస్టార్ చిరంజీవి మరోసారి ప్రజలకు మెగా మెసేజ్ను ఇచ్చారు. ప్రాణాంతక కరోనా వైరస్ చుట్టుముట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన చర్యలపై రెండు రోజుల కిందటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సందేశాన్ని ఇచ్చిన చిరు.. ఈ సారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయాన్ని సమర్థించాలని కోరారు. ఆయన ఇచ్చి న పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని చిరంజీవి సూచించారు.
Recommended Video
ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూను పాటించాలని చిరంజీవి విజ్ఙప్తి చేశారు. సామాజిక దూరం (సోషల్ డిస్టెన్స్)ను పాటించాలని కోరారు. సామాజిక దూరాన్ని పాటించడం ద్వారా కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి విస్తరించకుండా కట్టడి చేయొచ్చని సూచించారు. కరోనా వైరస్ను నియంత్రించడానికి క్షేత్రస్థాయిలో డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య, ఆరోగ్య బృందాలు, స్వచ్ఛ కార్మికులు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు అహర్నిశలు సేవా భావంతో 24 గంటలు ఎనలేని సేవలను అందిస్తున్నారని, చిరంజీవి ప్రశంసించారు. అలాంటి వారందరికీ కృతజ్ఙతలను తెలుపుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.
దీనికోసం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రతి ఒక్కరు తమ ఇంటి గుమ్మం ముందు నిల్చుని కరతాళ ధ్వనులతో వారికి కృతజ్ఙతలను తెలియజేయాలని చిరంజీవి విజ్ఙప్తి చేశారు. కరోనా వైరస్ను నియంత్రించడానికి దేశ ప్రజలు ఉమ్మడిగా కఠిన నిర్ణయాలను తీసుకోవాలని కోరారు. ప్రజలందరూ ఐకమత్యంతో ఒక్కటిగా నిలవాలని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో సామాజిక బాధ్యతలను పాటిద్దామని అన్నారు. కరోనా విముక్త భారత దేశాన్ని నిర్మించుకుందామని చిరంజీవి పిలుపునిచ్చారు.
Mega Star Chiranjeevi garu requests us to participate in #JanataCurfew and appreciate the efforts being put in by the officials. pic.twitter.com/xaV9sLJrKB
— Konidela Pro Company (@KonidelaPro) March 21, 2020