ముద్రగడ పాదయాత్రకు మళ్లీ బ్రేక్: బాబుపై ఆగ్రహం, ఉద్రిక్తత, పోలీసుల మోహరింపు
తూర్పుగోదావరి: ఛలో అమరావతి పేరుతో నిరవధిక పాదయాత్రను చేపట్టిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను పోలీసులు గురువారం మళ్లీ అడ్డుకున్నారు. ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ముద్రగడ తన అనుచరులతో కలిసి ఇంటి ఆవరణలో ఉన్న గేటు వద్దకు చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో పోలీసు అధికారులతో ముద్రగడ వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలనుకుంటన్న పాదయాత్రకు ఎందుకు ఆటంకం కలిగిస్తున్నారో చెప్పాలని ముద్రగడ.. పోలీస్ అధికారులను డిమాండ్ చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రకారం ప్రభుత్వం నుంచి పాదయాత్రకు అనుమతి తీసుకోవాలని.. కానీ మీరు అనుమతి తీసుకోని కారణంగానే అనుమతి ఇవ్వట్లేదని పోలీసులు ముద్రగడకు తెలిపారు. దీంతో ముద్రగడ పోలీసులతో మాట్లాడుతూ.. 2014లో చంద్రబాబు పాదయాత్రకు ఏ విధమైన దరఖాస్తు చేశారో, ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చిందో చెబితే తాను కూడా అనుమతి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు.
అయినప్పటికీ పోలీసులు అడ్డుకోవడంతో ముద్రగడ తిరిగి తన నివాసంలోకి వెళ్లిపోయారు. యాత్రకు అనుమతి ఇచ్చేవరకూ తన ప్రయత్నం కొనసాగుతుందని ముద్రగడ స్పష్టం చేశారు. చంద్రబాబునాయుడు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. పాదయాత్రను అడ్డుకోవడం సరికాదని అన్నారు.
మంజునాథ కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారని ముద్రగడ మండిపడ్డారు. ఇప్పటికే ప్రభుత్వానికి పాదయాత్రపై రూట్ మ్యాప్ అందజేసినట్లు తెలిపారు. తమది నిరవధిక పాదయాత్ర అని, వాయిదా వేసేది లేదని తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా పాదయాత్ర చేసితీరుతామని స్పష్టం చేశారు. కాగా, ముద్రగడ నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.