లక్ష్మీస్ ఎన్టీఆర్కు మళ్లీ బ్రేక్..! 19 వరకు నో షో: రీపోలింగ్ ఎఫెక్టేనా?
చిత్తూరు: సార్వత్రిక ఎన్నికల పర్వం తుది దశకు చేరుకుంది. శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం పరిసమాప్తమౌతుంది. 19వ తేదీన అంటే.. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు పోలింగ్ కొనసాగుతుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. దీనికి తగ్గట్టే- లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రదర్శనకు కూడా బ్రేక్ పడింది. 19 వరకు ఈ సినిమాను ప్రదర్శించకూడదంటూ ఆదేశాలు జారీ అయ్యాయి.
చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఈ మేరకు శుక్రవారం రాత్రి అత్యవసర ఉత్తర్వులను జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ సినిమా ప్రదర్శనపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా సినిమా ప్రదర్శనపై తాత్కాలిక నిషేధం కొనసాగుతుందని అన్నారు.
రీపోలింగ్ ఎఫెక్టేనా?
చివరి దశ పోలింగ్ సందర్భంగా చిత్తూరు జిల్లాలో అయిదు చోట్ల రీపోలింగ్ నిర్వహించబోతోంది ఎన్నికల సంఘం. జిల్లాలోని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఎన్ఆర్ కమ్మపల్లె, పులివర్తిపల్లె, కొత్తకండ్రిగ, కమ్మపల్లె, వెంకట్రామాపురంలల్లో రీపోలింగ్ నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని- లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై నిషేధం విధించినట్లు చెబుతున్నారు.
రాష్ట్రంలో ఎక్కడ సినిమా ప్రదర్శించినా, ఎగ్జిబిటర్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వుల కాపీని కలెక్టర్ ప్రద్యుమ్న- జిల్లాలోని రిటర్నింగ్ అధికారులు, ముగ్గురు ఎస్పీలు, సబ్ కలెక్టర్లు, ఆర్డీవో, తహసీల్దార్లకు పంపించారు.