ఏపీభవన్ సాక్షిగా చంద్రబాబుపై కుట్ర: డొక్కా;మేం కలిసామని నిరూపిస్తే దేనికైనా సిద్ధం:ఆకుల
గుంటూరు: వైసీపీ, బీజేపీ కుట్ర రాజకీయాలకు డిల్లీలో సమావేశమే నిదర్శనమని టీడీపీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవరప్రసాద్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలోని ఏపీభవన్ సాక్షిగా చంద్రబాబుపై కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు.
మరోవైపు ఢిల్లీలో బిజెపి-వైసిపి సమావేశం అబద్దమని భాజపా నేత ఆకుల సత్యనారాయణ స్పష్టం చేశారు. టిడిపి నేతలు వారు ఆరోపిస్తున్నట్లుగా తమ మధ్య సమావేశం జరిగిందని నిరూపిస్తే ఎలాంటి ఛాలెంజ్ కైనా సిద్దమని ఆయన సవాలు విసిరారు. అయితే తాను బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డిని కలిసిన విషయం మాత్రం వాస్తవమన్నారు.
ఢిల్లీలో బిజెపి నేతలతో వైసిపి ఎమ్మెల్యే, పిఎసి కమిటీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి సమావేశంపై టిడిపి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మండిపడ్డారు. గుంటూరులో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్పై ఉన్న కేసుల మాఫీకి కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తరుపున వైసీపీ ప్రచారం చేసిందని డొక్కా ఆరోపించారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ, వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు.
వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి ఆ రాక్షస సైన్యానికి శుక్రాచార్యుడని డొక్కా వ్యాఖ్యానించారు. బీజేపీ కుట్రలను దేశవ్యాప్తంగా ప్రచారం చేయనున్నట్లు ఈ సందర్భంగా డొక్కా వెల్లడించారు. నాలుగేళ్లలో కేంద్రం చేసిన మంచి పని ఒక్కటి కూడాలేదని డొక్కా ధ్వజమెత్తారు. కడప ఉక్కు పరిశ్రమపై వైసీపీ ఎందుకు నోరుమెదపడం లేదని డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రశ్నించారు. వైసిపిని జనాలు తరిమికొట్టడం ఖాయమన్నారు.
మరోవైపు బిజెపి-వైసిపి సమావేశం జరిగిందంటూ టిడిపి నేతలు చేస్తున్న ఆరోపణలను బీజేపీ నేత ఆకుల సత్యనారాయణ తప్పుబట్టారు. అమిత్షా, రామ్మాధవ్ను తాను, బుగ్గన అసలు కలవనేలేదని ఆయన స్పష్టం చేశారు. తాము కలిసినట్లు టీడీపీ నేతలు నిరూపిస్తే ఎలాంటి ఛాలెంజ్కైనా సిద్ధమని ఆకుల సవాల్ విసిరారు. అయితే తాను బుగ్గనను కలిసిన మాట వాస్తవమని...తామిరువురు కలసి శాంగ్రీ హోటల్లో లంచ్చేశామని ఆకుల తెలిపారు.
ఆ తరువాత ఒకే కారులో కలసి ఏపీ భవన్కు వచ్చామని ఆకుల సత్యనారాయణ చెప్పుకొచ్చారు. ఏపీ భవన్ ప్రభుత్వ గెస్ట్హౌస్ అని ఎవరైనా రావొచ్చని అన్నారు. దీనికి కూడా రాజకీయాలు ఆపాదించడం సరికాదన్నారు. టీడీపీ నేతలు కుటిల రాజకీయాలు చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆకుల మండిపడ్డారు. తాను ఢిల్లీ స్థాయిలోని నేతలెవరినీ కలవలేదని బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తేల్చిచెప్పారు.