సుజనా చౌదరి...చంద్రబాబుకు షాక్ ఇస్తారా?...ఆ మీడియా దిగ్గజమే కారణామా?
బిజెపితో వైరం టిడిపిపై పెను ప్రభావమే చూపించేలా ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏతో టిడిపి తెగతెంపుల నేపథ్యంలో ఆ పార్టీ వేధింపులకు పాల్పడనున్నట్లు స్వయంగా సిఎం చంద్రబాబే బహిరంగ వేదికల మీద ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పైకి ఎలా ఉన్నా చంద్రబాబు వ్యాఖ్యల ప్రభావం ఆ పార్టీ నేతల మీదగా తీవ్రంగా పనిచేస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
Recommended Video
కేంద్రంతో శత్రుత్వం వల్ల తమ ఆర్థిక, రాజకీయ మూలలపై ఎక్కడ దెబ్బపడుతుందోననే ఆందోళన ఆ పార్టీకి చెందిన పలువురు ప్రధాన నేతలను సైతం పీడిస్తోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రంతో వైరం వల్ల ప్రధానంగా నష్టపోయే అవకాశం ఉన్న టిడిపి నేతలు అందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అవలంబించేందుకు కార్యాచరణ ప్రారంభించేశారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో టిడిపి నేత, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి బిజెపిలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని, ఇటీవల చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలను బట్టి అలా జరిగే అవకాశాలను కొట్టిపడేయలేమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మొదలైంది...ఎప్పటినుంచంటే...
ఎన్డీఏ ప్రవేశపెట్టిన ఐదో బడ్జెట్ లోనూ ఎపికి అన్యాయం జరగడంతో ప్రజల నుంచి అసంతృప్తి జ్వాలలు చెలరేగడంతో టిడిపి కూడా కేంద్రంపై తిరుగుబాటు ప్రకటించింది. ఆ సందర్భంగా నిరసన తెలపాల్సిన క్రమంలో ఒక కార్యక్రమానికి సుజనా చౌదరి హాజరుకాలేదంటూ ఈ వ్యవహారంలో తొలిసారిగా సుజనా చౌదరిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆ తరువాత ఇటువంటిదే మరో ప్రధాన ఘటన కేంద్రం నుంచి,ఎన్డీఏ నుంచి టిడిపి కూటమి బైటకు వచ్చేసిన తరువాత...టిడిపి-బిజెపి ల మధ్య వైరం పతాక స్థాయికి చేరుకున్న క్రమంలో సుజనా చౌదరి జైట్లీతో రహస్యంగా భేటీ అయ్యారనే వార్త ప్రతిపక్షాల్లోనే కాదు సొంత పార్టీలోనూ తీవ్రంగా విమర్శలకు దారితీసింది. ఆ తరువాత ప్రధాని మోడీకి విజయసాయి రెడ్డి పాదాభివందనం వివాదం లోనూ సుజానా చౌదరి స్పందన, సన్నాయి నొక్కులు ఆయన వ్యవహారంపై అనుమానాలకు తావిచ్చింది.
ఇటీవలి పరిణామాలు...
ఆ తరువాత కూడా ఒక టివి ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రత్యేకించి కేంద్రం...టిడిపిపై,ఎపిపై కుట్ర పన్నడం లాంటివేమీ లేవని సుజనా తేల్చేయడం ఆ పార్టీ శ్రేణుల్నే నివ్వెరపరిచింది. దీంతో సుజనా చౌదరి వ్యవహారం కొంత తేడాగా ఉందనే సందేహం చంద్రబాబు నమ్మినా నమ్మకపోయినా టిడిపి శ్రేణుల్లో చాలామంది నమ్ముతున్నారు. ఈ క్రమంలో సుజనా చౌదరి ఇటీవలే పవన్ కళ్యాణ్ తో కలసి గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారనే పుకార్లు ఎపిలో జోరుగా షికార్లు చేస్తున్నాయి. అయితే ఆ భేటీ అసలు జరిగిందో లేదో, ఎప్పుడు జరిగిందో ఎవరికీ వివరాలు తెలియకపోవడంతో వాటిని ఎవరూ మరీ అంత సీరియస్ గా తీసుకోలేదు.
అయితే తాజా పరిణామంతో...నిజమేనని
అయితే కొన్ని టివి ఛానెళ్లపై యుద్దం ప్రకటించిన జనసేన అథినేత పవన్ కళ్యాణ్ తొలుత ఆ ఛానెళ్లలో సుజనా చౌదరి ప్రమోటర్ గా ఉన్న మహా న్యూస్ పై కూడా విమర్శనాస్త్రాలు సందించాడు. పర్యవసానాలకు సిద్ద పడమని సుజనాతో సహా మరో ఇద్దరికి వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయితే అనూహ్యంగా నాలుగు రోజులు గడిచేసరికి పవన్ తాను తొలుత యుద్దం ప్రకటించిన 4 ఛానెళ్ల జాబితా నుంచి మహా న్యూస్ ను తప్పించేశారు. తన యుద్దం 3 ఛానెళ్లకే పరిమితం చేశారు. సరిగ్గా ఈ తరుణంలోనే సుజనా చౌదరి-పవన్ కళ్యాణ్-గవర్నర్ భేటీ గురించి అంతకుముందు వచ్చిన రూమర్ల అంశం చర్చనీయాంశంగా మారింది. బిజెపి తో సుజనా చౌదరి కలసి ప్రయాణించేందుకు సిద్దమయ్యారని ఆ క్రమంలోనే పవన్-గవర్నర్ కు ఉన్న సత్సంబంధాల రీత్యా ఈ వివాదం నుంచి తమని మినహాయించేందుకు గవర్నర్ ద్వారా విన్నవించుకోవడం జరిగి ఉంటుందని రాజకీయ శ్రేణుల్లో ఊహాగానాలు, విశ్లేషణలు చోటుచేసుకున్నాయి.
పత్రిక,టివి ఛానెల్ అధినేత...కారణం గానేనా
టిడిపికి బాగా అనుకూలమనే పత్రిక, టివి ఛానెల్ అధినేత కారణంగానే సుజనా చౌదరి బిజెపి వైపు మొగ్గు చూపి ఉంటారనే విశ్లేషణలు ఊపందుకుంటున్నాయి. ఆ మీడియా అధిపతి తనకు వ్యతిరేకంగా అనేకసార్లు తన పత్రిక, టివి ఛానెల్లో ప్రత్యేక కథనాలు వండి వార్చి ప్రతిష్టను దెబ్బతీసారనే మనోవేదన సుజనా చౌదరిలో ఉందని ఆయన సన్నిహితుల వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. పైగా ఇటీవలి కాలంలో సుజనా చౌదరి బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే కథనాలు కూడా మొదట స్టార్ట్ చేసింది, అలాగే జైట్లీతో సుజనా వివాదాస్పద భేటీ వ్యవహారం, ఆ వ్యవహారాన్ని అనూహ్యంగా చంద్రబాబు ఎదుట ముఖ్యమైన సమావేశంలో యనమల బైటపెట్టడానికి కారణం కూడా ఆ మీడియా అధినేతే కారణమని సుజనా చౌదరి ఆగ్రహంతో ఉన్నారట. తాను టిడిపిలో ఉంటే ఆ మీడియా అధినేత కారణంగానే ముందు ముందు రెంటికీ చెడ్డ రేవడి అవుతాననే భావనతో సుజనా తనకు క్షేమకరమైన మార్గం చూసుకొంటు ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.