ఏపీలో కొత్తగా ఒక్కటే పాజిటివ్ కేసు: ఆ ఒక్కటీ ఎక్కడంటే: జిల్లాలవారీగా లెక్కలివీ..?
అమరావతి: రాష్ట్రంలో వరుసగా రెండో రోజు కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యలో చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గుదల కనిపించింది. సోమవారం ఉదయం 11 గంటల వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 14 మాత్రమే. తాజాగా- మంగళవారం ఉదయం అదే సమయానికి ఒక్క పాజిటివ్ కేసు మాత్రమే నమోదు అయింది. దీనితో ఇప్పటిదాకా రాష్ట్రంలో ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య 304కు చేరుకుంది.
గుంటూరు వ్యక్తికి సోకిన కరోనా..
సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి ఈ ఉదయం 9 గంటల వరకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఒక్కటి మాత్రమే పాజిటివ్ కేసుగా నిర్ధారితమైందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ నోడల్ అధికారి ఆర్జా శ్రీకాంత్ తెలిపారు. గుంటూరులో ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు డాక్టర్లు ధృవీకరించినట్లు చెప్పారు. సోమవారం ఉదయం నమోదైన కేసుల సంఖ్యతో పోల్చుకుంటే పాజిటివ్ కేసుల్లో భారీగా తగ్గుదల చోటు చేసుకుందని అన్నారు.
కర్నూలులో ఒకరు మృతి..
అదే సమయంలో కర్నూలు జిల్లాలో వైరస్ బారిన పడి ఒకరు పేషెంట్ మరణించినట్ల నోడల్ అధికారి తెలిపారు. దీనితో మొత్తం మృతుల సంఖ్య నాలుగు చేరింది. 45 సంవత్సరాల ఆ పేషెంట్ ఈ నెల 1వ తేదీన అనారోగ్యానికి గురి కావడం వల్ల కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. వెంటనే అతనికి వైద్య పరీక్షలను నిర్వహించారు. రక్త నమూనాలను సేకరించి ల్యాబొరేటరీలో పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్గా తేలింది.
ట్రావెల్ హిస్టరీ లేకపోయినా..
అంతకుముందే అతనికి టైప్-2 డయాబెటిస్ సమస్యలు ఉన్నాయని అధికారులు తెలిపారు. పాజిటివ్గా నిర్ధారితమైన ఆ పేషెంట్ సోమవారం మరణించినట్లు అధికారికంగా వెల్లడించారు. అతనికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని చెప్పారు. ఇదిలావుండగా.. వరుసగా రెండో రోజు ఉదయం వరకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం వల్ల సానుకూలం సంకేతాలను పంపిస్తోందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక్క కేసు కూడా నమోదు కాకూడదని తాము కోరుకుంటున్నామని చెబుతున్నారు.
జిల్లాలవారీగా పాజిటివ్ లెక్కలివీ..
జిల్లాలవారీగా అనంతపురం-6, చిత్తూరు-17, తూర్పు గోదావరి-11, గుంటూరు-33, కడప-23, కృష్ణా-28, కర్నూలు-56, నెల్లూరు-34, ప్రకాశం-23, విశాఖపట్నం-20, పశ్చిమ గోదావరి-16 కేసులు నమోదయ్యాయి. వారిలో చాలామంది ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ మసీదు భవనంలో నిర్వహించిన తబ్లిగి జమాత్ సామూహిక మత ప్రార్థనలతో లింక్ ఉన్నవేనని అధికారులు చెబుతున్నారు. తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నంలల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా పేషెంట్లు పూర్తిగా కోలుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.