ఒక్క ఓటుకు కోటి రూపాయలు ఆఫర్ చేశారట!...బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సంచలనం
అమరావతి:ఓటుకు నోట్ల జాడ్యం అన్నిరకాల ఎన్నికలకు పాకిందా?...అంటే అవుననేటట్లుగానే ఉన్నాయి పరిస్థితులు. తాజాగా ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా ఒక ఓటు కొనుగోలుకు అంత డబ్బు ఆఫర్ చేశారంటూ జరుగుతున్న ప్రచారం సంచలనం సృష్టిస్తోంది.
ఇంతకూ ఒక్క ఓటు కోసం వారు ఆఫర్ చేసిన ఆ ధర ఎంతో తెలిస్తే ఎవరైనా దిగ్భ్రాంతి చెందవలసిందే. ఓటుకు రూ. కోటి!...అవునండీ అక్షరాలా ఒక్క ఓటుకు కోటి రూపాయలే. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఛైర్మన్ పదవికి తాము చెప్పిన వ్యక్తికి ఓటు వేస్తే రూ.కోటి ఇస్తామని ఆఫర్ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం న్యాయవాదుల్లో చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు ఈ ఆఫర్ల ప్రచారంపై ఏకంగా కొందరు సీఎం కార్యాలయానికే ఫిర్యాదులు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఈ వ్యవహారంపై ఏసీబీతో విచారణ జరిపించాలని కొందరు తమ ఫిర్యాదుల్లో కోరారని తెలిసింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన బార్ కౌన్సిల్ ఎన్నికల్లో...మొత్తం 23 వేలమంది న్యాయవాదులు ఓటింగ్ లో పాల్గొని 25 మంది సభ్యులను ఎన్నుకున్నారు.
అనంతర దశలో ఈ పాతిక మంది సభ్యులు కలిసి బార్ కౌన్సిల్ కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బార్ కౌన్సిల్ చైర్మన్ పదవికి భారీ డిమాండ్ ఏర్పడినట్లు తెలిసింది. ఇలా బార్ కౌన్సిల్ అధ్యక్షునిగా ఎన్నికైన వారికి ఐదేళ్లపాటు పదవీకాలం ఉంటుంది. బార్ కౌన్సిల్ కు న్యాయవాదుల సంక్షేమ నిధి మంజూరు, న్యాయవాదుల దుష్పవర్తన ఆరోపణలు, న్యాయ కళాశాలలపై పర్యవేక్షణ వంటి పలు అంశాలపై విశేషాధికారాలు ఉంటాయి.
ఇదిలావుంటే బార్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా ఒక్క ఓటుకు కోటి రూపాయలు ఆఫర్ చేసినట్లు జరుగుతున్న ప్రచారంపై సాధారణ ప్రజానీకం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. కోటీశ్వరులు కావాలంటే వ్యాపారాలు చేయక్కర్లేదని...ఉద్యోగం చేస్తూ ఏళ్ల తరబడి కూడబెట్టక్కరలేదని...బార్ కౌన్సిల్ లో ఒక్క ఓటు ఉంటే చాలని చర్చించుకుంటున్నారు.