ఒకే కుటుంబం..! నాలుగు జెండాలు..! ఏపిలో విచిత్ర రాజకీయాలు..!!
అమరావతి : ఏపీ రాజకీయాలు ఎప్పుడూ వాడివేడిగా ఉంటాయి. ఆదిపత్యం, అదికారం కోసం నాయకులు చేయని విన్యాసాలు ఉండవు. అవసరం అనుకుంటే సిద్దాంతాలను పక్కన పెట్టి ఇంటికో అభ్యర్థి వేర్వేరు పార్టీల జెండాలను మోయడానికి సైతం సై అంటుంటారు ఏపి నేతలు. ప్రస్తుతం ఏపిలో ఇలాంటి పరిస్తితులే నెలకొన్నాయి. అదికార పార్టీకి చెందిన సన్నిహితులు ప్రతిపక్ష పార్టీ లోకి, ప్రతిపక్ష పార్టీ నేతల సన్నిహితులు అదికార పార్టీలోకి మారిపోతున్నారు. ఇద్దరికి కుదరని నేతలు జనసేనలో చేరిపోతున్నారు. దీంతో ఒకే ఇంటిపై మూడు, నాలుగు జెండాలు ఎగురుతున్నాయి. ఏపిలో రాజకీయం ప్రస్తుతం ఇలాంటి పరిణామాలతో ఆసక్తిగా మారింది.
ఏపిలో జంపింగ్ జిలానీల విన్యాసాలు..! ఆసక్తికరంగా మారిన రాజకీయాలు..!!
కడప జిల్లా రాయచోటి నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యే టికెట్ ఆశించిన విజయసాయిరెడ్డి బావమరిది గడికోట ద్వారకానాథ్రెడ్డి తీసుకున్న నిర్ణయం వైసీపీని కలవరపాటుకు గురిచేసింది. ఆయన అమరావతికి వెళ్లి చంద్రబాబును కలవడం వైసీపీలో ఆందోళన రేకెత్తించింది. రాయచోటి నుంచి ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గడికోట శ్రీకాంత్ రెడ్డి మళ్లీ టికెట్ ఆశిస్తున్నారు. వైసీపీ అధిష్టానం కూడా దాదాపుగా శ్రీకాంత్ రెడ్డికే టికెట్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వైఎస్ జగన్తో శ్రీకాంత్ రెడ్డికి ఉన్న సాన్నిహిత్యం అలాంటిది. గడికోట శ్రీకాంత్ రెడ్డికి ద్వారకానాథ్ రెడ్డి వరుసకు అన్నయ్య అవుతారు. గత ఎన్నికల్లో శ్రీకాంత్ రెడ్డికి టికెట్ ఇచ్చినప్పటికీ సంయమనం పాటించిన ద్వారకానాథ్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో మాత్రం తనకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు.
రాజకీయం ముందు బందుత్వం బలాదూర్..! అదికారం కోసం దేనికైనా రెఢీ..!!
రాయచోటి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఈసారి తానే వైసీపీ అభ్యర్థినని ప్రచారం కూడా చేసుకున్నారు. తన బావ విజయసాయిరెడ్డితో టికెట్ విషయం గురించి కూడా ప్రస్తావించారు. అయినప్పటికీ సరైన స్పందన లేకపోవడంతో టీడీపీ వైపు ఆయన ఆశగా చూస్తున్నట్లు తెలిసింది. అయితే.. టీడీపీ కూడా రాయచోటి నుంచి ద్వారకానాథ్ రెడ్డి పోటీ చేస్తే వైసీపీని ధీటుగా ఎదుర్కోవచ్చని భావిస్తోంది. ఒకవేళ.. ద్వారకానాథ్ రెడ్డికి టికెట్ ఇస్తే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన టీడీపీ అభ్యర్థి రమేష్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది.
అదికారం కోసం ఆరాటం..! ఒకే కుటుంబంలో మూడు పార్టీలు..!!
ఇదిలా ఉంటే.. గత ఎన్నికల్లో ఏ ఇబ్బందులు లేకుండా కడప జిల్లాలో హవా సాగించిన వైసీపీకి ఈసారి మాత్రం వర్గపోరు తలనొప్పిగా మారింది. ఇప్పటికే మేడా చేరికతో రాజంపేట సీటుపై రోజుకో రాజకీయం నడుస్తోంది. ద్వారకానాథ్ రెడ్డి చంద్రబాబును కలవడం వైసీపీకి ఊహించని షాకిచ్చింది. దగ్గుబాటి కుటుంబాన్ని చేర్చుకుని బాబుకు ఝలక్ ఇచ్చామని వైసీపీ భావిస్తుండగానే.. విజయసాయిరెడ్డి బావమరిది టీడీపీకి దగ్గరవడం ఆ పార్టీకి మింగుడుపడని పరిణామంగా మారింది. రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారి సన్నిహితులకు ఇతర పార్టీలు గాలం వేయడం కొత్తేమీ కాదు.
అంతా అదికారం కోసమే..! అయిన వాళ్లు కూడా అవసరం లేదు..!!
ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిణామాలు మాత్రం ఆసక్తికరంగా మారాయి. దగ్గుబాటి వెంకటేశ్వరావు కొడుకుతో సహా వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కానీ.. ఆయన భార్య, మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి మాత్రం బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి కుమారుడు మహేష్ రెడ్డి వైసీపీలో చేరారు. గురజాల నుంచి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఆయన తండ్రి కాసు కృష్ణారెడ్డి మాత్రం కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారు. ఇలా ఒకే కుటుంబంలోని వ్యక్తులు వేరువేరు పార్టీల్లో ఉండటం కొత్త కానప్పటికీ.. వైసీపీ కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి బావమరిది టీడీపీలో చేరాలని నిర్ణయించుకోవడం ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.