రోజా సహా వైసీపీ మహిళా ఎమ్మెల్యేలపై అసభ్య కామెంట్స్ పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు!
గుంటూరు: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలను కించపరుపస్తూ ఫేస్బుక్లో అసభ్యకర, అభ్యంతరకర కామెంట్లను పోస్ట్ చేసిన ఓ వ్యక్తిని గుంటూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఆయనను మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. నిందితుడి పేరు పునుగుపాటి రమేష్. ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురంలో నివాసం ఉంటున్నారు. అసెంబ్లీలో రోజా సహా అధికార పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలు ఆరుమంది ఒకే చోట కూర్చున్న ఫొటోను సోషల్ మీడియా పోస్ట్ చేశారు. దానికి అసభ్యకరమైన కామెంట్లను జత చేశారు. మహిళా ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీని సైతం కించపరిచేలా వ్యాఖ్యానాలను జోడించారు.
ఈ వ్యవహారంపై ఆగ్రహించిన మహిళా ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచారి దృష్టికి తీసుకెళ్లారు. ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వారి కోరిక మేరకు ఈ ఘటనపై బాలకృష్ణమాచారి జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును నమోదు చేసుకున్న రంగంలోకి దిగారు. పునుగుపాటి రమేష్ పై కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే రమేష్ పరారయ్యారు.
నెల్లూరు, కోయంబత్తూరు, సేలం, చెన్నై, బెంగుళూరు ఇలా ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో తన మకాంను మార్చుతూ వచ్చారని ఈ కేసును దర్యాప్తు చేసిన గుంటూరు రూరల్ అదనపు ఎస్పీ కె చక్రవర్తి విలేకరులకు తెలిపారు. తన న్యాయవాదితో మాట్లాడటానికి గుంటూరుకు వస్తుండగా, ముందస్తు సమాచారం అందుకుని ఆయనను గుంటూరు రైల్వేస్టేషన్లో పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. కేసు నమోదైన వెంటనే అదృశ్యమైన నిందితుడు సుమారు 30 సిమ్ కార్డులు మార్చారని అన్నారు. రమేష్ ను అరెస్టు చేయడానికి ఆరు బృందాలను ఏర్పాటు చేశామని చక్రవర్తి చెప్పారు.