ఒక్క చేరిక., వంద అవరోధాలు..! వైసీపిలో దగ్గుబాటి ఎపిసోడ్ తో వింత పరిణామాలు..!!
ప్రకాశం|హైదరాబాద్ : ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు స్థబ్ధుగా ఉన్న వైసీపీ రాజకీయాలు దగ్గుపాటి వెంకటేశ్వర రావు రాకతో ఒక్కసారిగా భగ్గుమన్నాయి. చిన్న చిన్న మనస్పర్థలు మినహా జిల్లాలో అందరూ కలిసి పని చేసుకుంటున్నారు. అకస్మాత్తుగా దగ్గుబాటి వైసీపీలోకి రావడాన్ని పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా పర్చూరు నియోజకవర్గం నేతలు దగ్గుబాటి చేరికను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. వెంకటేశ్వర రావు చేరికను వ్యతిరేకిస్తూ పర్చూరులో వైసీపీ నాయకులు, కార్యకర్తలు సమావేశమై భవిశ్యత్ కార్యాచరణపై చర్చించారు. దీంతో సామరస్యంగా ఉన్న వైసీపి ప్రకాశం జిల్లా రాజకీయాలు ఒక్క సారిగా నివురు గప్పిన నిప్పులా పరిణమించాయి.
దగ్గుబాటి వారసుడు హితేష్ చెంచురాం కు పర్చూరు టికెట్ ఇవ్వడాన్ని స్థానిక వైసీపి నేతలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీని నమ్ముకుని ఇన్నాళ్లూ పనిచేసిన వారిని కాదని, అన్యాయం చేస్తే సహించబోమని వైసీపీ నేతలు ముఖ్య నేతలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ లోకి చేరడం, నమ్ముకున్న వారిని ఇబ్బందులు పెట్టడం దగ్గుబాటి రాజకీయమని స్థారిక నేతలు ఘాటుగా ఆరోపిస్తున్నారు.
పార్టీలో దగ్గుబాటి ఫామిలీకి కీలక పదవులు అంటగడితే తాడోపేడో తేల్చుకోవాలనే యోచనలో పర్చూరు నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లోటస్ పాండ్లో వైసీపీ అధినేత జగన్ను దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఆదివారం కలిసి చర్చలు జరిపారు. తన కుమారుడు హితేష్ను ఆయనకు పరిచయం చేసి, వచ్చే ఎన్నికల్లో పర్చూరు నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించాల్సిందిగా కోరారు. ఇందుకు జగన్ కూడా పూర్తి సానుకూలత తెలియజేసిన విశయం తెలిసిందే..! మరి దగ్గుబాటి కుంటుంబం వైసీపిలో చేస్తున్న అలజడిని పార్టీ అదినేత జగన్మోహన్ రెడ్డి ఎలా అదిగమిస్తారో చూడాలి.