చిత్తూరు సెక్స్ రాకెట్లో షాకింగ్ వాస్తవాలు, ఒక్కడే 90 మందిని..
చిత్తూరు: చిత్తూరు సెక్స్ రాకెట్లో నిర్ఘాంతపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. మహిళలను విదేశాలకు తరలించిన విషయంలో నిందితుడు పోలీసుల ఎదుట నోరు విప్పాడు. పోలీసుల దర్యాఫ్తు గొలుసుకట్టు కథలా వెళ్తోంది. ఈ అక్రమ తరలింపు స్థానికంగా కలకలం రేపుతోంది.
రఫీ విదేశాలకు 90 మంది మహిళల్ని విక్రయించాడు
నిందితుడు రఫి ఒక్కడే 90 మంది మహిళలను విదేశాల్లోని వేశ్యా గృహాలకు తరలించాడు. మహిళలను ఉద్యోగాల పేరుతో చెప్పి విదేశాల్లోని వ్యభిచార గృహాలకు విక్రయిస్తున్నాడు. ఉద్యోగాల పేరుతో విదేశాల్లోని గృహాలకు విక్రయిస్తున్నారని చిత్తూరు జిల్లా సత్యవేడులో ఓ మహిళ గత నెల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఇటీవల చెన్నైలో తమిళనాడుకు చెందిన రఫి, పాండియన్ను అరెస్టు చేశారు.
విచారణలో షాకింగ్ వాస్తవాలు
అదే ముఠాకు చెందిన పగో జిల్లాకు చెందిన ఏసుప్రేమ, తూగో జిల్లాకు చెందిన సోమేశ్వర్, చెన్నైకి చెందిన పాతిమాను అరెస్టు చేసిన పోలీసులు, కోర్టులో హాజరుపరిచారు. వీరు ప్రస్తుతం రిమాండులో ఉన్నారు. కోర్టు అనుమతితో రఫీ, పాండియన్లను పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించారు. విచారణలో రఫీ ఆసక్తికర విషయాలు వెల్లడించాడని తెలుస్తోంది.
జిల్లాల్లో ఏజెంట్లు, ఉద్యోగం పేరుతో
రఫీ.. చిత్తూరు అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు ఏజెంట్లను నియమించుకున్నాడు. భర్తతో విడిపోయిన మహిళలు, వితంతువులు, పెద్దగా బంధువులు లేనివాళ్లు, ఆర్థిక కష్టాల్లో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకొని విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ప్రచారం చేసేవాడు. ఈ క్రమంలో తాను ఒక్కడినే 90 మంది మహిళలను విదేశాలకు తరలించినట్లు, మలేషియా, సింగపూర్, గల్ఫ్ దేశాలకుపంపించినట్లు అంగీకరించాడని తెలుస్తోంది.
గొలుసు కట్టు కథలా
ఇందులో చాలామందిని వ్యభిచార గృహాలకు అమ్మేశామని చెప్పాడని తెలుస్తోంది. వీళ్లలో ఎంతమంది విదేశాల్లోనే ఉన్నారు, ఎంతమంది తిరిగి వచ్చారనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో పాస్ పోర్టు కార్యాలయాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు. కాగా, ఇది ఓ గొలుసు కట్టు కథలా ఉంది. గత ఇరవై రోజుల్లో మహిళల తరలింపులో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు.