ముందునుంచీ చెప్తున్నా: హోదా కోసం ఆత్మహత్యపై పవన్, జగన్ స్పందన
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం త్రినాథ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతని మృతి తమను కలచివేసిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు వారు ప్రకటనలు చేశారు.
త్రినాథ్ బలవన్మరణం సంఘటన గురించి తెలియగానే మనసు వికలమైందని, హృదయాన్ని కలచి వేసిందని పవన్ అన్నారు. కన్నవారికి ఎంతటి శోకాన్ని మిగులుస్తుందో అర్థం చేసుకోగలనని చెప్పారు. ప్రాణత్యాగం చేసిన త్రినాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కడుపు కోతను దిగమింగుకొనే ధైర్యాన్ని కన్నవారికి భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హోదా హామీని సాధించుకోవడంలో పాలకులు విఫలమయ్యారని, హోదా సాధనలో పాలకులు అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణి ప్రజల్లో ముఖ్యంగా యువతలో అసహనాన్ని పెంచుతోందన్నారు. ముందు నుంచీ చెబుతూనే ఉన్నానని, స్వీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చి హోదా, విభజన హామీల అమలును పట్టించుకోకపోవడం వల్లే ఇంతకు ముందు తిరుపతిలో మునికోటి, నేడు త్రినాథ్ ప్రాణత్యాగాలు అన్నారు.
యువకుల ప్రాణ త్యాగాలతోనైనా ప్రభుత్వాలు కళ్లు తెరిచి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. హోదా విషయంలో ఎవరు ఎన్ని మాటలు మార్చినా సాధనలో విఫలమైనా మనందరం బలంగా ప్రజల ఆకాంక్షను వినిపిద్దామని, దయచేసి ఎవరూ బలి దానాలకు పాల్పడవద్దని, ఏపీకి హోదా దక్కే వరకూ పోరాడుదామన్నారు.
త్రినాథ్ ఆత్మహత్యపై జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. త్రినాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోరాటాల ద్వారా హోదా సాధించుకుందామని, ఎవరూ ప్రాణత్యాగాలు చేయవద్దని కోరారు.
కాగా, విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్ గేటు వద్ద ఉన్న సెల్ టవర్కు ఉరివేసుకొని త్రినాథ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడంతో మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు.
ప్రత్యేక హోదా సాధనకు అందరూ ఏకమై పోరాడాలని ఆ లేఖలో కోరాడు. అమ్మా నన్ను క్షమించాలని, నీ మాట తప్పుతున్నానని, ప్రపంచంలో నువ్వంటే నాకు ఎంతో ఇష్టమని, అన్నయ్యా.. అక్క, అమ్మ జాగ్రత్త అని, బావగారూ ఇకపై ఇంటికి మీరే దిక్కు, సెలవు అని పేర్కొన్నారు.
ఆనాడు హైదరాబాద్ అభివృద్ధి విషయంలో చూసిన శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంపై చూపించాలని కూడా తన సూసైడ్ నోట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరాడు. 'అయ్యా, సీఎం గారు, హైదరాబాద్ అభివృద్ధి విషయంలో మీరు చూపించిన శ్రద్ధ, ప్రత్యేక హోదా విషయంలో చూపించండి. అప్పుడే, నా మరణానికి ఒక అర్థం' అని త్రినాథ్ పేర్కొన్నారు.
'కేరళ వరదల్లో అతలాకుతలమైందని, ఆ రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. అంతా నగదు రూపంలో వారికి సాయం చేస్తున్నారు. మీడియాతో పాటు సినీ ప్రముఖులు కూడా ముందుకు వచ్చి సాయం చేయాలని అడుగుతున్నారు. ఇది తప్పు అనడం లేదు. కానీ, అంతకన్నా ఎక్కువ వరద బాధితులు సార్ ఏపీ ప్రజలు. దయచేసి గుర్తించండి' అని సూసైడ్ నోట్లో పేర్కొన్నారు.