వైఎస్ జగన్ సొంత జిల్లాలో మరో నీటి ప్రాజెక్టు: 20 టీఎంసీల కెపాసిటీతో: గాలేరు-నగరిపై
ముద్దనూరు: దశాబ్దాల కాలం పాటు నీటి ఎద్దడిని ఎదుర్కొంటోన్న రాయలసీమలో మరో నీటి ప్రాజెక్టు నిర్మితం కాబోతోంది. పోతిరెడ్డి పాడు ద్వారా కృష్ణా జలాల వరద జలాలు, అదనపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి ఇప్పటికే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం..తాజాగా మరో రిజర్వాయర్ను నిర్మించడానికి ప్రతిపాదనలను రూపొందిస్తోంది. హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా- కడప జిల్లాలో ఈ రిజర్వాయర్ను నిర్మించడానికి అవసరమైన కసరత్తు చేపట్టింది ప్రభుత్వం. రాయలసీమ నీటి ఎద్దడిని నివారించడం ద్వారా తాను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఆ ప్రాంతానికి న్యాయం చేసినట్టవుతుందని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి.. రావి కొండలరావు మృతిపై కేసీఆర్, జగన్, చంద్రబాబు సంతాపం
జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలో..
జిల్లాలోని జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ముద్దనూరు మండలంలో కొత్తగా ఈ ప్రాజెక్టును నిర్మించడానికి జల వనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. గండికోట ప్రాజెక్టుకు ఎగవన 10 కిలోమీటర్ల దూరంలో కొత్త ప్రాజెక్టును నిర్మించడానికి జిల్లా జల వనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలను రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు. ముద్దనూరు మండలంలోని దీనేపల్లి, ఆరవేటి పల్లి గ్రామాల మధ్య ఈ ప్రాజెక్టు నిర్మించడానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఇదివరకే జిల్లా జల వనరుల శాఖ అధికారులు సర్వే నిర్వహించినట్లు సమాచారం.
3,650 కోట్ల రూపాయల అంచనాతో..
మొత్తం 20 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యంతో దీన్ని నిర్మించడానికి జిల్లా అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. దీని నిర్మాణ వ్యయం 3,650 కోట్ల రూపాయలుగా ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఇందులో మార్పులు చేర్పులు ఉండొచ్చని చెబుతున్నారు. కృష్ణా వరద జలాలను గరిష్ఠంగా వినియోగించుకోవడంలో భాగంగా ఈ ప్రాజెక్టును నిర్మించ తలపెట్టిందనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమౌతోంది. ప్రస్తుతం గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు కింద 50 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేసే రిజర్వాయర్లు అందుబాటులో ఉన్నాయి.
గండికోట సహా
గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు కింద గండికోట రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 26.85 టీఎంసీలు. దీనికి అదనంగా వామికొండ, సర్వారాయ సాగర్, మైలవరం, పైడిపాలెం జలాశయాలు ఉన్నాయి. దీనికి అదనంగా దీనేపల్లి-ఆరవేటి పల్లి గ్రామాల మధ్య కొత్త ప్రాజెక్టును నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదలను రూపొందిస్తున్నట్లు సమాచారం. కొత్తగా తలపెట్టిన ఈ ప్రాజెక్టు వల్ల కనీసం 10 వేల అదనపు ఎకరాలకు సాగునీటిని అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోందని అంటున్నారు.
288 మీటర్ల వరకు నీటి నిల్వ.. అయిదు కిలోమీటర్ల పొడవున ఎర్త్ డ్యామ్..
దీనేపల్లి-ఆరవేటి పల్లి మధ్య నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టులో 288 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ ఉంచడానికి అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి అవసరమైన వరద ప్రవాహం కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎర్త్ డ్యామ్ పొడవు అయిదు కిలోమీటర్లు ఉండేలా చర్యలు తీసుకోవచ్చని చెబుతున్నారు. గండికోట రిజర్వాయర్తో పోల్చుకుంటే భౌగోళికంగా ఈ రిజర్వాయర్ 75 మీటర్ల ఎత్తులో ఉంటుందని అంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మంగపట్నం వద్ద లిఫ్ట్ను ఏర్పాటు చేసే అవకాశాల మీద కూడా అధికారులు సర్వే నిర్వహిస్తున్నారని సమాచారం.