జనాన్ని చదవడానికి జనసేనానికి మరో సెమిస్టర్..! పవన్ పాసవ్వడానికి మరో ఏదేళ్లు..!
అమరావతి/హైదరాబాద్ : మార్పు కోసం రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవర్ స్టర్ పవన్ కళ్యాణ్ ను తెలుగు ప్రజలు అంతగా ఆదరించలేదు. సాధారణ ఎన్నికల్లో గెలిస్తే అసెంబ్లీకి వెళ్లాల్సిన పవన్ కళ్యాణ్. ఓటమి తరువాత ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశం పై ఉత్కంఠ నెలకొంది. ఐదేళ్ల విరామంలో సినిమాల వైపు నడుస్తారా! కేడర్ను అభివృద్ధి చేసుకునేందుకు పల్లెయాత్ర చేస్తారా! అభిమానుల సంగతి ఎలా ఉన్నా.. ప్రత్యర్థులు మాత్రం పవన్కు రాజకీయాలు సరిపడవు అంటున్నారు. అన్న చిరంజీవి మాదిరిగానే.. జనసేనను కూడా ఏదోపార్టీలో విలీనం చేయటమేనంటూ హేళన చేస్తున్నవారూ ఉన్నారు. మరి పవన్ ప్రస్థానం ఎటువైపు...?
అసలైన రాజకీయానికి సిసలైన పరీక్ష..! ప్రిపరేషన్ గట్టిగా ఉండాలంటున్న ఫాన్స్..!!
జనసేనకు పటిష్టమైన విధివిధానాలున్నాయి. నీతివంతమైన పాలన అందించగలరనే భావన అధికశాతం విద్యావంతుల్లోనూ ఉంది. అయినా రాజకీయాల్లో ముఖ్యంగా ఏపీ వంటి భిన్నమైన ఓటర్లున్న చోట ఢిల్లీ రాజకీయాలు చెల్లుబాటు కావని గతంలో లోక్సత్తా ద్వారానే అర్ధమైంది. మళ్లీ అదేదారిలో మార్చుతానంటూ వస్తే మారేందుకు ప్రజలు సిద్ధపడట్లేదు. సంక్షేమపథకాలు, ఉచిత సేవలకు జై కొడుతున్నారు. ముఖ్యంగా పాలకులు విసిరే నోట్లకు ఆశపడుతున్నారు. అది వారి తప్పుకూడా కాదు.. ఇచ్చే డబ్బు ఏదోఒక అవసరానికి వస్తాయనే ఆశ కూడా దీనికి కారణం తెలుస్తోంది.
కులాన్ని పెద్దగా పట్టించుకోని ఎపి జనం..! కాపులు కూడా పవన్ ని దూరం పెట్టిన వైనం..!!
ఇటువంటి సంప్రదాయ రాజకీయాలకు పట్టం కడుతున్న ఏపీలో పవన్ కూడా రాజకీయాలు అలాగే చేయాలంటున్నారు జనసైనికులు. తాము సేవా కార్యక్రమాలు చేపట్టినా.. పదిమందికి సాయపడినా.. పోలింగ్ ముందరోజు పంచే నోట్లకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ జనసైనికులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. బీమవరం, గాజువాకలో కేవలం కాపులను నమ్ముకుని బరిలోకి నిలిచాడనే అపఖ్యాతి పవన్ మూటగట్టుకున్నారు. ఎలాగని కాపులు కూడా పవన్కు జై దాఖలాలు అక్కడ కనిపించలేదు.
రాబోవు ఐదేళ్లూ జనంతో ఉంటే తిరుగుండదు..! పవన్ సహనానికి పరీక్ష..!!
కాపులు బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ వైసీపీ వైపు కాపులు ఆసక్తిచూపారు. టీడీపీతో పవన్ అంటకాగుతున్నాడనే కోపం కూడా దీనికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. తాను ఒంటరిగా పోటీచేస్తున్నానంటూ పవన్ చెప్పినా.. అప్పటికే బుర్రల్లోకి చేరిన టీడీపీ వ్యతిరేకత వైసీపీ ఓటుబ్యాంకుగా మారి.. పవన్కు ఘోరంగా దెబ్బతీసింది. కొత్తగా వచ్చిన వారిని నమ్మితే.. మున్ముందు తమ రాజకీయ జీవితం ఎలా ఉంటుందనే కాపు నేతల ఆందోళన కూడా పవన్కు ఓటును దూరం చేశాయి.
మార్పుకోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్..! అంతగా మారని జనం..!!
ఇవన్నీ తప్పిదాలే అయినా.. జనంలో తనను తాను నిరూపించుకునేందుకు పవన్కు మరో ఐదేళ్ల సమయం ఉంది. ఈ వ్యవధిలో పవన్ ఏం చేస్తాడు.. పార్టీను ఎలా అభివృద్ధి పరుస్తాడనేది కూడా చాలా కీలకం. పార్టీను నడపటం ఖర్చుతో కూడుకున్నపని. విరాళాలు వచ్చినా అవి నామ్కేవాస్త్గా మాత్రమే. మరి దీనికోసం మరోసారి రంగుపూసుకుని కెమెరా ముందుకు వెళ్లేందుకు కూడా పవన్ సిద్ధపడవచ్చనేది అభిమానుల అంతరంగం. అయితే పవన్ తాను సినిమాలకు గుడ్ బై చెప్పినట్లు తేల్చిచెప్పారు. ఇటువంటి వేళ పవన్ దారెటు అనేది ఆసక్తికరంగా మారింది.