బీసీ కొత్త దంపతులకు ‘చంద్రన్న పెళ్లి కానుక’: నిరుద్యోగ యువతకు ‘భృతి’..
అమరావతి: మరో నాలుగు రోజులు గడిస్తే తెలుగు నేలపై 'ఎన్నికల' వేడి క్రమంగా ముందుకొస్తుంది. అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు ముందు నుంచే చర్యలు తీసుకుని ప్రజలకు దగ్గరయ్యేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న 'ప్రజా సంకల్పయాత్ర'కు సామాన్యుల నుంచి అనూహ్య సానుకూల స్పందన లభిస్తున్న విషయమై ఏపీ సీఎం వాస్తవ పరిస్థితులను అంగీకరించారన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.
అన్ని రంగాలను ఆకట్టుకునేలా వైఎస్ జగన్ చేస్తున్న వాగ్దానాలతో పట్టు తప్పుతున్నదా? అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సైతం ఆంధ్రులను తన దరిన చేర్చుకునేందుకు ఒక రాయితీతో కూడిన పథకాన్ని అమలు చేయబోతున్నారు. వచ్చేనెల 12వ తేదీ నుంచి నిరుద్యోగ భ్రుతి ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు మరో ప్రజాదరణ గల పథకాన్ని ప్రజల ముందుకు తేనున్నారు.
ఈ పథకం అమలుకు రూ.300 కోట్లు కేటాయించిన ఏపీ సర్కార్
న్యూఇయర్ గిఫ్టుగా ‘చంద్రన్న పెళ్లి కానుక' అనే పథకంతో వెనుకబడిన వర్గాలకు చెందిన నూతన దంపతులకు ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ పథకం ప్రకారం ప్రతి వెనుకబడిన వర్గాలకు చెందిన నూతన దంపతులకు వివాహ సమయంలో రూ.25 వేల నుంచి రూ.40 వేల ఆర్థిక సాయం అందజేస్తారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించింది. కొద్ది రోజుల్లో ఈ పథకం అమలు చేయనున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం జీవో జారీ చేయనున్నది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నారు.
2019లోగా పలు పథకాలు ముందుకొచ్చే చాన్స్
చంద్రన్న పెళ్లి కానుక పథకం అమలుకు మూడు దశల తనిఖీ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. వివాహ సమయం నుంచి వివాహం పూర్తయ్యే వరకు ఈ తనిఖీలు చేపడతారు. ఎంపికైన దంపతుల్లో భార్య బ్యాంకు ఖాతాలో ప్రభుత్వ అధికారులు నగదు జమ చేస్తారు. ఇందుకోసం వెనుకబడిన తరగతుల శాఖ అధికారులు ఆన్లైన్లో వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. వెనుక బడిన శాఖ అధికారులే ఈ పథకం అమలు తీరు తెన్నులను పూర్తిగా పర్యవేక్షిస్తారు. చంద్రన్న పెళ్లి కానుకతోపాటు 2019 ఎన్నికల సంరంభం ప్రారంభమయ్యే నాటికి చంద్రబాబు ప్రభుత్వం నుంచి పలు ప్రజాదరణ పథకాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
యూత్ పాలసీ ద్వారా నైపుణ్య శిక్షణ ఇచ్చే అవకాశాలు
ఆంధ్రప్రదేశ్ అంతటా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ భ్రుతి పథకం జనవరి 12వ తేదీ నుంచి అమలు చేసేందుకు రంగం సిద్ధమవుతున్నది. జనవరి 12న స్వామి వివేకానందుడి జయంతి సందర్భంగా ఈ పథకాన్ని అమలు చేయాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయించింది. ‘యూత్ పాలసీ'ద్వారా ప్రతి నిరుద్యోగ యువకుడికి అన్ ఎంప్లాయిమెంట్ అలవెన్స్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారని రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సంకేతాలిచ్చారు. నిరుద్యోగ భ్రుతి ఇవ్వడం ద్వారా నైపుణ్యాభివ్రుద్ధికి మార్గం సుగమం చేస్తూ నూతన ‘యూత్ పాలసీ' ఉంటుందన్న సంకేతాలిచ్చారు మంత్రి కొల్లు రవీంద్ర.
ప్రజా సంకల్ప యాత్రలో నిలదీస్తున్న వైఎస్ జగన్
చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోయిన వైనాన్ని ప్రజా సంకల్ప యాత్రలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పదేపదే గుర్తు చేస్తున్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ ‘జాబు కావాలంటే బాబు రావాలి' అన్న నినాదాన్నిచ్చింది. ఇదే విషయాన్ని జగన్ గుర్తు చేస్తున్నారు. అంతే కాదు ఉద్యోగం లేని నిరుద్యోగ యువతకు భ్రుతి ఇస్తామని కూడా చంద్రబాబు గత ఎన్నికల ప్రచారంలోనే ప్రకటించారు. కానీ మళ్లీ ఎన్నికలు వస్తున్నందున ఆ హామీ అమలు దిశగా చర్యలు చేపట్టబోతున్నారన్న మాట.
నూతన సంవత్సరం మొదటి నుంచే నిరుద్యోగ భ్రుతి?
చంద్రబాబు ఇచ్చిన హామీలేవీ అమలుకు నోచుకోలేదని సమయం చిక్కినప్పుడల్లా వైఎస్ జగన్ ఎండగడుతుండటంతో అధికార వర్గాలు ‘యూత్ పాలసీ' రూపకల్పనపై ద్రుష్టి సారించారని వినికిడి. వచ్చే దసరా పండుగ నుంచే అమలు చేయాలని చంద్రబాబు సంకల్పించినట్లు వార్తలు వచ్చినా ఆయన మనస్సు మార్చుకుని ప్రజల్లో ప్రత్యేకించి యువతలో భారీ మార్పు తెచ్చేందుకు నూతన సంవత్సర ప్రారంభం నుంచే అమలు చేయడానికి సంసిద్ధమయ్యారని వినికిడి.
ఉపాధి కల్పనాకేంద్రంలో నమోదు చేసుకున్న వారికి తక్షణం లబ్ధి
ఈ పథకం కింద 18 - 40 ఏళ్ల మధ్య యువకులు మాత్రమే అర్హులు. పీజీ పూర్తి చేసిన వారికి నెలకు రూ.2000, డిగ్రీ పూర్తి చేస్తే రూ.1500, ఇంటర్ పాసైతే రూ.1000 అన్ ఎంప్లాయి అలవెన్స్ ఇస్తారని చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా జిల్లా ఉపాధి కల్పనా కేంద్రాల్లో నమోదు చేసుకున్న యువతకు తక్షణం లబ్ధి చేకూరనున్నది. తాజాగా నిరుద్యోగులు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం గడువు విధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.