గ్రామ వలంటీర్ ఆత్మహత్య: నెలన్నర వ్యవధిలో రెండో ఘటన!
ఒంగోలు: ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్దిదారుల ఇంటి వరకు చేర్చడానికి ఉద్దేశించిన గ్రామ వలంటీర్లు అవమానాలకు గురి అవుతున్నారు. రాజకీయపరమైన కారణాలు కావచ్చు, వృత్తిపరంగా చోటు చేసుకునే తప్పులు గానీ పొరపాట్లు గానీ కారణం కావచ్చు. వలంటీర్లపై కొందరు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దుర్భాషలాడుతున్నారు. ఈ పరిణామం అవాంఛనీయ సంఘటనలకు దారి తీస్తోంది. ప్రకాశం జిల్లాలో ఓ గ్రామ వలంటీర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. నెలన్నర రోజుల వ్యవధిలో ఓ గ్రామ వలంటీర్ ఆత్మహత్య చేసుకోవడం ఇది రెండోసారి
కిందటి నెల 7వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో నవీన అనే గ్రామ వలంటీర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఘటనకు సంబంధించిన దర్యాప్తు కొనసాగున్న సమయంలోనే ప్రకాశం జిల్లా యర్రగొండ పాలెంలో మరో వలంటీర్ బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. ఆ వలంటీర్ పేరు షేక్ జుబేదా. తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తోన్న గుంటూరి శివప్రసాదాచారి బెదిరించడం, అవమానకరంగా మాట్లాడటం వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తల్లి కరీమున్నీసా ఆరోపిస్తున్నారు. తన కుమార్తె మరణానికి శివప్రసాదాచారే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
యర్రగొండపాలెంలో షేక్ జుబేదా గ్రామ వలంటీర్ గా చేరారు. తహశీల్దార్ కార్యాలయానికి అనుబంధంగా విధులను నిర్వర్తిస్తున్నారు. అదే కార్యాలయంలో శివప్రసాదాచారి కంప్యూటర్ ఆపరేటర్ గా చాలాకాలం నుంచీ పని చేస్తున్నారు. షేక్ జుబేదాకు కేటాయించిన 50 ఇళ్లకు సంబంధించిన కొన్ని రికార్డులను కంప్యూటరీకరించాల్సిన పనులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని వెంటనే పూర్తి చేయాలని శివప్రసాదాచారి ఆమెపై ఒత్తిడిని తీసుకొచ్చాడని, వాటిని సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల అసభ్యకరమైన పదజాలంతో దూషించడాని కరీమున్నీసా చెబుతున్నారు.
ఏపీలో ఆ ఉద్యోగుల సేవలు రద్దు: నెలాఖరులోగా తొలిగించండి: ప్రభుత్వ నిర్ణయం వెనుక..!
అవమానపరచడాన్ని తట్టుకోలేక షేక్ జుబేదా ఆత్మహత్య చేసుకుందని కరీమున్నీసా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైన విషయం తెలుసుకున్న వెంటనే అతను పరారయ్యాడని అంటున్నారు. అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. శివప్రసాదాచారిపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు చెప్పారు. ఈ ఘటనపై జిల్లా పాలన, పోలీసు యంత్రాంగం ఆరా తీస్తోంది. ఇదివరకు పశ్చిమ గోదావరి జిల్లాలో నవీన ఆత్మహత్య చేసుకోవడం. ఈ ఘటన చోటు చేసుకున్న నెలన్నర రోజుల్లోనే మరో గ్రామ వలంటీర్ బలవన్మరణానికి పాల్పడటాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.