ఎమ్మెల్యే 'ఆమంచి' కి అన్నీ తెలుసులే..! లేదంటే 12 లక్షలు గోవిందా..! స్వామీజీ గుట్టురట్టు
చీరాల : మోసాలకు కాదేదీ అనర్హమన్నట్లుగా మాయగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. నాలుగు మాయమాటలు చెబుతూ నమ్మినోళ్లను నట్టేట ముంచుతున్నారు. బాబాలు, స్వామీజీలు ఆడిందే ఆటగా సాగుతుండటంతో అమాయక ప్రజలు గుడ్డిగా మోసపోతున్నారు. అదలావుంటే కొంతమంది బాబాలు పెద్ద మొత్తంలో డబ్బు చేతికి అందుతుందని పెద్దోళ్లను టార్గెట్ చేస్తున్నారు. అదే కోవలో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు శఠగోపం పెట్టబోయారు.
ఆమంచికి శఠగోపం పెట్టే ప్రయత్నం
జనాల్లో ఉన్న వీక్ నెస్ కావొచ్చు.. లేదంటే భయం కావొచ్చు.. ఇంకేదైనా ఉండొచ్చు. సరిగ్గా ఇదే అంశం బాబాల పంట పండిస్తోంది. వారికి కాసుల వర్షం కురిపిస్తోంది. నమ్మేటోళ్లు ఉంటే చాలు నలభై రకాల మాటలు చెబుతారు.. నాలుగు కాసులు కాజేస్తారు. అయితే కామన్ పీపుల్ ఇళ్లల్లో ఇలాంటి మోసాలు కామన్ గా మారుతున్నాయి. ఇక కొంతమంది బాబాలైతే కొడితే కుంభస్థలం కొట్టాలనుకుంటున్నారు. పూజలు, మంత్రాలంటూ పెద్దపెద్దోళ్లను టార్గెట్ చేస్తూ లక్షల్లో దోచేస్తున్నారు.
చినోళ్లను టార్గెట్ చేస్తే చిన్నమొత్తమే వస్తుంది. అదే పెద్దోళ్లపై కన్నేసే పెద్దమొత్తం వస్తుంది. అలా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పై గురిపెట్టాడు ఓ స్వామీజీ.
బఫూన్ పిలిస్తే వెళ్లాలా?.. నోరు అదుపులో పెట్టుకో.. కేటీఆర్ Vs వీహెచ్
12 లక్షలు నొక్కేద్దామని..!
సహదేవుడు అనే కోయజాతికి చెందిన వ్యక్తి స్వామీజీగా చలామణి అవుతున్నాడు. అతడికి కుమార్ బాబు అనే వ్యక్తి అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. ముందుగా తాము టార్గెట్ చేసుకున్న వ్యక్తుల ఇంటికెళ్లి కుమార్ బాబు అన్నీ వివరాలు మాట్లాడతాడట. స్వామీ గురించి అహో ఓహో అంటూ చెప్పేసి మాయమాటలతో ముగ్గులోకి దించుతాడట. అలా అలా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పై వీరి కన్ను పడింది.
ఆమంచిని టార్గెట్ చేస్తూ వేటపాలెం మండలం పందిళ్ళపల్లిలోని ఆయన ఇంటికెళ్లారు. ఆ సమయంలో ఆమంచి లేకపోవడంతో అక్కడున్నవారితో పూజలు, మంత్రాలంటూ ఏవో కథలు చెప్పారట. అవన్నీ చేయాలంటే 12 లక్షలకు పైగా ఖర్చవుతుందని కహానీ వినిపించారట. అలా మాట్లాడుతుండగానే ఆమంచి అక్కడకు చేరుకున్నారు. అసలు విషయం ఆరా తీయడంతో ఆయనకు కాసింత అనుమానం వచ్చింది.
అనుమానమొచ్చింది.. అడ్డంగా దొరికారు
అదలావుంటే తనను వెతుక్కుంటూ వచ్చారు కదా అనే ఉద్దేశంతో వాళ్లతో మాటలు కలిపారు ఆమంచి. అలా మాట్లాడుతున్న సమయంలో ఆయన అడిగేదానికి, వారు చెప్పేదానికి పొంతన లేకుండా పోయింది. అయితే నువ్వు మిగతా విషయాలు మాట్లాడి త్వరగా రా అంటూ కుమార్ బాబుకు చెప్పేసి అక్కడి నుంచి స్వామీజీ (సహదేవుడు) వెళ్లిపోయాడు.
స్వామీజీ, ఆయన అనుచరుడి వాలకంపై అనుమానమొచ్చిన ఆమంచి వేటపాలెం పోలీసులకు సమాచారం అందించారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు కుమార్ బాబును అదుపులోకి తీసుకుని పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు వీరిపై ఎలాంటి కేసులు లేనట్లు సమాచారం. అయితే ఈ ఎపిసోడ్ సోమవారం నాడు జరిగినా.. ఆలస్యంగా వెలుగుచూసింది. మొత్తానికి ఎమ్మెల్యేకే ఎసరు పెట్టాలని చూసిన ఈ స్వామీజీ వ్యవహారం ఎలాంటి మలుపులకు దారితీస్తుందో చూడాలి.