ఏపీ ప్రతిపక్ష పార్టీ కి మరో ఎమ్మాల్యే షాక్..! అనుకోని విపత్తులతో విలవిల లాడుతున్న వైసీపి..!!
ఆంద్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీకి అనుకోని అవరోధాలు ఎదురౌతున్నాయి. జగన్ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా అన్ని అంశాలు చక్కబడ్డాయి అనుకున్న తరుణంలో పార్టీలో మరో అరిష్టం జరిగిపోంతోంది. పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్లిపోవడం, ఎంపీలు రాజీనామాలు చేయడం, పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తడం వైసీపి మనుగడకు శరాఘాతంలా పరిణమించాయి. అంతే కాకుండా కోర్టు కేసులు వీగిపోతాయా, వెంటాడుతాయా తెలియక గందరగోళ పరిస్థితిలో ఉన్న జగన్ మోహన్ రెడ్డికి ఆ గుంటూరు ఎమ్మెల్యే వ్యవహారం తలనొప్పిగా పరిణమించింది. ఇప్పటికే పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలకు ఎలా అడ్డుకట్ట వేయాలా అని ఆలోచిస్తున్న జగన్మోహన్ రెడ్డికి సదరు ఎమ్మెల్యే వ్యవహారం కంటిమీద కునుకులేకుండా చేస్తోందట..! ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే..? ఏంటా కథ..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!
గుంటూరు జిల్లా నుంచి మరో ఎమ్మెల్యే ఔట్..! కట్టడి చేయలేకపోతున్న అదిష్టానం.!!
గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం రాజకీయాలు రానురాను మరింత వేడెక్కుతున్నాయి.రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని వైసీపీ అధినేత జగన్ ఎన్నోఆశలు పెట్టుకుంటే ఉన్న ఎమ్మెల్యేలు ఎవరికి వారు ఎమునా తీరు అన్న చందంగా తయారయ్యారు. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి వ్యవహారం పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. బాపట్ల నుంచి గెలుపొందిన కోన నియోజకవర్గంతో తనకు ఎలాంటి సంబంధం లేనట్టుగానే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆయన పార్టీని బలోపేతం చేయడం లేదని, ప్రజల్లోకి వెళ్లడం లేదనే వాదన వినిపిస్తోంది. పైగా పార్టీ అధినేత జగన్ ఇచ్చిన ఆదేశాలను సైతం పూర్తిగా ఆచరించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ఇక్కడ వైసీపీ పార్టీ ప్రభావం నానాటికీ బలహీనంగా మారిపోతోందని స్థానికులు అంటున్నారు.
నియోజకవర్గంతో సంబందం లేనట్టుగా ఎమ్మెల్యే..! విసుగుచెందుతున్న స్థానికులు..
మరోవైపు నియోజకవర్గంలో సామాజిక సమీకరణల పరంగా చూస్తే ఇక్కడ కోన గెలవడం అసాధ్యమంటున్నారు. అయితే ఫ్యామిలీ ఇమేజ్తో పాటు నియోజకవర్గంలో టీడీపీలో ఉన్న విబేధాల నేపథ్యంలో గత ఎన్నికల్లో కోన విజయం సాధించారనే వాదన వినిపిస్తుంటుంది. అలాగే ఆయన ఎమ్మెల్యేగా నాలుగేళ్లలో బాపట్లకు చేసింది శూన్యమనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీన్నిలావుంచితే వైసీపీలోనే ఆయనకు ఏ మాత్రం పట్టులేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఆమధ్య ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై జగన్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు బంద్ను చేశాయి. చంద్రబాబుకు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలను చేపట్టాయి. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో సైతం కొన్ని చోట్ల బంద్ ప్రభావం కనిపించింది.
అసహనంలో ఎమ్మెల్యే.. అదిష్టానం ఆదేవాలు భేఖాతరు..!
కానీ వైసీపీ ఎమ్మెల్యే కోన ఉన్న చోట బాపట్లలో బంద్ అనుకున్న స్థాయిలో జరగలేదనే విశ్లేషణ వినిపించింది. దీనిని చూస్తే కోన రఘుపతి వైసీపీపై ఎటువంటి వైఖరితో ఉన్నారనేది స్పష్టమవుతున్నదని విశ్లేషకులు అంటున్నారు.అలాగే పార్టీ ప్రారంభించిన ఇంటింటికీ వైసీపీ, నవ రత్నాలు తదితర కార్యక్రమాలను ఆయన ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమయ్యారనే వాదన వినిపిస్తోంది. దీనికితోడు ఎస్సీ, ఎస్టీ, రెడ్డి సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పై వారంతా విముఖత ప్రదర్శిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వచ్చే ఎన్నికలలో తాము కోనకు ఎందుకు ఓట్లు వేయాలని వారు ప్రశ్నిస్తున్నారట!. అలాగే వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ ఆయనకు టికెట్ ఇస్తే ఆ పార్టీకే నష్టమని వ్యాఖ్యానిస్తున్నారట.
విసిగిపోయిన అదిష్టానం.. వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టమే..!
అయితే నియోజకవర్గంలో వైసీపీకి మద్దతు పలికే రెడ్డి సామాజికవర్గం ఓటర్లు 28 వేల పైనే ఉన్నారు. వీరంతా గత ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేయడంతోనే కోన రఘుపతి గెలిచారనే వాదన ఉంది. ఇదిలావుంటే, మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ కుమార్తో పాటు నియోజకవర్గ టీడీపీ నాయకులు నరేంద్ర వర్మ ధాటికి నియోజకవర్గంలో వైసీపీ డోలయామానంలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇకనైనా జగన్ ఇక్కడి వైసీపీ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించాలని పలువురు సూచిస్తున్నారు.