రాష్ట్రంలో ఒకవైపు ఎండ...ఇంకోవైపు వర్షం:అదే విచిత్ర వాతావరణం
విశాఖపట్నం:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకవైపు ఎండలు మండిపోతుండగా మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అప్పటివరకు భానుడి ప్రతాపంతో విలవిల్లాడిన ప్రజలు కొద్ది సేపట్లోనే వాతావరణం అనూహ్యంగా మారి చీకట్లు కమ్ముకొచ్చి భారీ వర్షాలు కురుస్తుండటంపై జనాలు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.
అయితే మరట్వాడ నుంచి కర్ణాటక వరకు ద్రోణి, తమిళనాడులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న కారణంగానే వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రెండు రాష్ట్రానికి చాలా దూరంలో ఉన్నప్పటికీ శనివారం ఉత్తర కోస్తాలో అక్కడక్కడా మేఘాలు ఏర్పడి ఉరుములతో జల్లులు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి తెలపడం గమనార్హం.
రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో పలుచోట్ల ఎండతీవ్రత నెలకొంది. అనంతపురం, కర్నూలులో 41 డిగ్రీలు నమోదైంది. అయితే ఆదివారం నుంచి ఎండ మరింత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇదిలావుండగా ఎపిలో ఇటీవలికాలంలో ఎన్నడూ లేనివిధంగా పిడుగులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ మంగళవారం ఒక్కరోజే నాడే 41 వేలకుపైగా పిడుగులు పడినట్లు శాస్త్రజ్ఞులు వెల్లడించిన సంగతి తెలిసిందే. అలాగే గత నెల ఇరవైఆరున ముప్పై ఆరువేల పిడుగులు పడినట్లు శాస్త్రజ్ఞులు వెల్లడించడం గమనార్హం.
ఈ పిడుగులను గుర్తించడానికి విపత్తు శాఖ సెన్సార్ల వ్యవస్థ ను సమకూర్చుకున్న నేపథ్యంలో ఈ సెన్సార్ల నుంచి వచ్చే సమాచారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సెన్సార్లు మెరుపులను కూడా పిడుగులుగా నమోదు చేస్తుండటం వల్లే అంత భారీ సంఖ్యలో పిడుగులు పడుతున్నట్లు గా రికార్డవుతోందని మరి కొందరు వాతావరణ శాస్త్రజ్ఞులు విశ్లేషిస్తున్నారు.