ప్రజావేదిక కూల్చివేతకు ఏడాది-- జగన్ లక్ష్యం నెరవేరిందా ? కక్షకు సాక్ష్యంగా మిగిలిపోయిందా.!
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్టపై నిర్మించిన ప్రజావేదికను గతేడాది వైసీపీ సర్కారు అధికారంలోకి రాగానే కూల్చివేసింది. అప్పట్లో అక్రమ కట్టడంగా గుర్తించి దీన్ని కూల్చివేస్తున్నట్లు ప్రకటించిన సీఎం జగన్... ఆ తర్వాత ఆ ప్రాంతంలోని మిగతా అక్రమకట్టడాలతో పాటు రాష్ట్రంలో కుప్పలు తెప్పలుగా ఉన్న అలాంటి నిర్మాణాలను మాత్రం ఏమీ చేయలేకపోయారు. దీంతో ఇది కేవలం జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా తీసుకున్న నిర్ణయంగానే మిగిలిపోయింది. ప్రజా వేదిక కూల్చివేసి ఏడాది పూర్తయిన సందర్బంగా వైసీపీ ప్రభుత్వ నిర్ణయం అనుకున్న ఫలితాన్ని ఇచ్చిందా లేదా అన్న అంశంపై ఓ విశ్లేషణ...
ప్రజావేదిక కూల్చివేత...
గతేడాది మే 30న భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో తాము అక్రమ కట్టడంగా పేర్కొంటూ ఉద్యమాలు చేసిన ప్రజావేదికపై వైసీపీ సర్కారు కన్నుపడింది. మాజీ సీఎం చంద్రబాబు ఇంటి పక్కనే ముఖ్యమంత్రి అధికారిక కార్యకలాపాలు, కలెక్టర్ల సమావేశాల కోసం నిర్మించిన ప్రజావేదికలో సీఎం జగన్ చివరి సారిగా కలెక్టర్ల సమావేశం నిర్మించారు. అప్పట్లో కలెక్టర్ల సమావేశంలో ఐఏఎస్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్... మీ నిర్వాకం వల్లే ఇలాంటి నిర్మాణాలు పుట్టుకొస్తున్నాయని నిప్పులు చెరిగారు. సమావేశం ముగియగానే ప్రజావేదిక కూల్చివేతకు అక్కడే ఆదేశాలు ఇచ్చారు. సరిగ్గా కలెక్టర్ల సమావేశం ముగిసిన తర్వాత రోజే ప్రజావేదిక నేలకూలింది.
మిగతా కట్టడాల మాటేంటి ?
ఏ అక్రమ కట్టడం పేరుతో టీడీపీ సర్కారు నిర్మించిన ప్రజావేదిక కూల్చివేతను చేపట్టారో ఆ స్ఫూర్తి రాష్ట్రమంతటా విస్తరిస్తుందని, ప్రభుత్వ స్ధలాలను, చెరువులను, కుంటలను, నదులను ఆక్రమించి నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన ఎన్నో కట్టడాలను జగన్ సర్కారు కూల్చివేయబోతోందని ఆశించిన వారికి నిరాశ తప్పలేదు. కనీసం ప్రజావేదిక చుట్టూ పదుల సంఖ్యలో నదీగర్భాన్ని ఆక్రమించిన కట్టిన ఎన్నో నిర్మాణాలను ఇవాళ్టికీ ముట్టుకునేందుకు జగన్ సర్కారు సాహసించలేదు. కనీసం వాటి గురించి మాట్లాడేందుకు ఇప్పటికీ సీఎం జగన్ కాదు కదా ప్రభుత్వంలోని కింది స్ధాయి అధికారి కూడా ఇష్టపడటం లేదు. దీంతో కేవలం ప్రజావేదికపై ఉన్న కక్షతోనే ఆ రోజు ఈ కూల్చివేత చేపట్టారని అందరికీ అర్ధం కావడానికి ఎంతో కాలం పట్టలేదు.
హైకోర్టులో కేసులే సాకు...
రాష్ట్రంలో ప్రజావేదికతో పాటు వేల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటికీ వాటిని చూసీ చూడనట్లుగానే వదిలేస్తోంది. కోర్టు కేసుల పేరుతో అధికారులు వాటి జోలికి వెళ్లేందుకే ఇష్టపడటం లేదు. అలాంటిది కేవలం ప్రజావేదికను కూల్చడం ద్వారా ప్రభుత్వం సాధించిందేంటన్న ప్రశ్న ఇప్పటికీ జనాన్ని వేధిస్తూనే ఉంది. ప్రజావేదిక కూల్చివేత తర్వాత మిగతా నిర్మాణాల జోలికి వెళ్లేందుకు కోర్టు కేసులను సాకుగా చూపుతున్న ప్రభుత్వ పెద్దలు.. ఎన్నో కేసుల్లో హైకోర్టు, సుప్రీంకోర్టులో ముఖాముఖీ తలపడుతున్న విషయం ప్రతీ రోజూ కనిపిస్తూనే ఉంది. దీంతో కేసులు ఒట్టి సాకు మాత్రమేనని స్పష్టమవుతోంది.
Recommended Video
ప్రజావేదిక కూల్చివేత పర్యవసానం...
జగన్ సర్కారు ఏడాది క్రితం చేపట్టిన ప్రజావేదిక కూల్చివేతతో రాష్ట్రంలో భారీ ఎత్తున కలెక్టర్ల సమావేశం నిర్వహించే వేదికే లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వం అప్పటి నుంచి కలెక్టర్ల సమావేశం కూడా నిర్వహించలేదు. కేవలం ప్రతీ మంగళవారం సీఎం జగన్ స్పందన వీడియో కాన్ఫరెన్స్ పేరుతో అధికారులతో మాట్లాడుతున్నారు తప్ప పూర్తిస్ధాయి కలెక్టర్ల సమావేశం నిర్వహించే పరిస్దితి లేదు. ప్రజా వేదిక కూల్చివేత ద్వారా విలువైన ప్రజాధనం దుర్వినియోగం కావడంతో పాటు అధికారిక కార్యకలాపాల నిర్వహణకు ప్రస్తుత రాజధాని అమరావతిలో విశాలమైన ప్రాంగణం కూడా లేకుండా పోయింది. అయినా జగన్ సర్కారు మాత్రం దీనికి ప్రత్యామ్నాయాన్ని ఇవాళ్టికీ కనుగొనలేకపోయింది. తద్వారా ప్రజావేదిక కూల్చివేతతో జరిగిన నష్టంపై ఇవాళ్టికీ ప్రభుత్వ వర్గాలతో పాటు అక్కడి జనం కూడా గుర్తుచేసుకుంటూనే ఉన్నారు.