జగన్ రాజధానుల ప్రకటనకు ఏడాది- రగులుతున్న అమరావతి-365 రోజుల వ్యధ
ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో గతేడాది డిసెంబర్ 17న వైసీపీ ప్రభుత్వం మొదలుపెట్టిన మూడు రాజధానుల ప్రక్రియ ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. ఆ రోజు సీఎం హోదాలో వైఎస్ జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటన ఈ ఏడాదంతా రైతు కుటుంబాల్లో ఆవేదనకు కారణమైంది. అయినా ఇప్పటికీ ఓ పరిష్కారం లేని సమస్యగానే అమరావతి కనిపిస్తోంది. అమరావతిలో రాజధాని ఉంటుందని చెప్పిన ప్రభుత్వం, ఆ మేరకు స్ధానికులకు భరోసా మాత్రం ఇవ్వలేకపోతోంది. రాజధానికి కీలకమైన సచివాలయాన్ని విశాఖకు తరలించేశాక ఇక అక్కడేముంటుందన్న స్ధానికుల ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం కనిపించడం లేదు. దీంతో ఏడాది పూర్తయినా అమరావతి రగులుతూనే ఉంది. ఈ నేపథ్యంలో జగన్ డిసెంబర్ 17 ప్రకటన తర్వాత జరిగిన పరిణామాలు ఓసారి పరిశీలిద్దాం..
జగన్ మూడు రాజధానుల ప్రకటన...
ఏపీలో గతేడాది అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం అమరావతిలో ఉన్న రాజధాని ఉంటుందన్న గ్యారంటీతోనే ఎన్నికల్లో గెలిచింది. కానీ ఎన్నికలు ముగిసి అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు అమరావతిపై చేస్తున్న వ్యాఖ్యలతో ఏదో జరగబోతోందన్న అనుమానాలు మొదలయ్యాయి. అమరావతిని ఓ మంత్రి స్మశానంతో పోలిస్తే మరో మంత్రి మునిగిపోయే ప్రాంతంగా అభివర్ణించారు. దీంతో అమరావతి నుంచి రాజధాని తరలిస్తారా అన్న పుకార్లు సాగాయి. వీటికి పరాకాష్టగా గతేడాది డిసెంబర్ 17న అసెంబ్లీలో ఏపీకి మూడు రాజధానులు రావొచ్చేమో అంటూ చేసిన ప్రకటన రాష్ట్రాన్నే కాదు దేశంలోనే పలువురికి ఆశ్చర్యం కలిగించింది. దేశంలోనే కాదు ఏపీలో సైతం ఒక్క రాజధాని అభివృద్ధికే నిధుల్లేని పరిస్ధితుల్లో జగన్ చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాంశమైంది.
జగన్ ప్రకటనతో భగ్గుమన్న అమరావతి
ఏపీలో మూడు రాజధానులు రావొచ్చేమో అంటూ జగన్ చేసిన ప్రకటన అమరావతిలో అగ్గి రాజేసింది. అప్పటికే అక్కడ రాజధాని వస్తుందని భారీగా స్ధలాలు, ఇళ్లు కొనుగోలు చేసిన సాధారణ జనంతో పాటు రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల్లోనూ ఆందోళన వ్యక్తమైంది. దీంతో ఓ దశలో రాష్ట విభజన నాటి ఆక్రోశం ఇక్కడి ప్రజల్లో కనిపించింది. చివరికి ప్రభుత్వం ఉక్కుపాదంతో ఉద్యమాన్ని అణచివేయగలిగింది. అయినా రైతుల్లో, మహిళల్లో ఆశ చావలేదు. ఆ రోజు కుటుంబాలతో రోడ్డెక్కిన అమరావతి జనం ఇవాళ్టికీ రోడ్లపైనే కనిపిస్తున్నారు. కనికరం లేని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏడాది పాటు ఉద్యమాన్ని పూర్తి చేశారు.
చట్టసభల్లో ఓడిన అమరావతి
అమరావతి స్ధానంలో మూడు రాజధానుల కోసం వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు బిల్లులను అసెంబ్లీ రెండుసార్లు ఏకగ్రీవంగా ఆమోదించింది. శాసనమండలిలో ఓసారి సెలక్ట్ కమిటీకి పంపినా రెండోసారి చర్చకు కూడా అనుమతించలేదు. అయినా ఈ బిల్లులకు వచ్చిన నష్టమేమీ లేదు. ప్రభుత్వం కోరిక మేరకు గవర్నర్ హరిచందన్ వాటికి ఆమోద ముద్ర వేసేశారు. రాజ్యాంగం ప్రకారం చట్టసభలతో పాటు గవర్నర్ ఆమోదం కూడా పొందిన బిల్లులు చట్టాలుగా మారడమే మిగిలుంది. అయితే ఈ బిల్లుల ఆమోదంపై హైకోర్టులో జరుగుతున్న న్యాయపోరాటం ఫలిస్తుందేమో అన్న ఆశ మాత్రం అమరావతి రైతులు, విపక్షాలకు మిగిలుంది.
ఇతర ప్రాంతాలకు పట్టని అమరావతి
రాష్ట్రంలో 13 జిల్లాలున్నాయి. అమరావతి రాజధానిగా ఈ 13 జిల్లాలనూ గత టీడీపీ ప్రభుత్వం పాలించింది. అయితే కృష్ణా, గుంటూరు మినహా మిగిలిన 11 జిల్లాల ప్రజలూ అమరావతిని తమదిగా భావించేలా చేయడంలో అప్పటి టీడీపీ ప్రభుత్వాధినేత చంద్రబాబు విఫలమయ్యారు. రాజధాని వల్ల రెండు జిల్లాల ప్రజలకే లబ్ది అన్న భావన కలిగించారు. దీంతో పక్కనే ఉన్న గోదావరి జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు ప్రజలు కూడా అమరావతిని తమదిగా భావించలేని పరిస్ధితి తలెత్తింది. సహజంగానే ఈ ప్రభావం మూడు రాజధానుల ప్రక్రియకూ కలిసొచ్చింది. కేవలం అమరావతిలోనే జరుగుతున్న ఉద్యమాన్ని రాజధాని ఉద్యమంగా, రాష్ట్ర ప్రజల ఉద్యమంగా గుర్తించేందుకు ఇవాళ్టికీ ఎవరూ సాహసించలేని పరిస్ధితి.
పోటీ నిరసనలతో ప్రభుత్వం ఎదురుదాడి
ఎప్పుడైతే అమరావతి ఉద్యమాన్ని స్ధానికులు మినహా ఇతర ప్రాంతాల వారు అంగీకరించడం లేదని తేలిపోయిందో అప్పుడే వైసీపీ సర్కారు కూడా తమ వ్యూహాలకు పదును పెట్టింది. అమరావతిలోనే పోటీ ఉద్యమాలకు తెరలేపడం ద్వారా అసలు ఉద్యమాన్ని పలుచన చేసే ప్రయత్నాలు చేస్తోంది. దళిత, బహుజనులను ముందుపెట్టి పోటీ ఉద్యమానికి పరోక్ష మద్దతునిస్తోంది. ఇప్పుడు అసలు అమరావతి ఉద్యమం కంటే ఈ మూడు రాజధానుల ఉద్యమానికే ఎక్కువ మంది పోలీసులు కాపలా కాస్తున్న పరిస్ధితి అక్కడ కనిపిస్తోంది. దీంతో సహజంగానే అమరావతి పోటాపోటీ నిరసనలతో రగులుతోంది. తాజాగా అమరావతి ఉద్యమ శిబిరంపై రాళ్లదాడి కూడా జరిగింది.
Recommended Video
అమరావతికి న్యాయస్ధానాలే దిక్కు...
ఏ దిక్కూ లేని వారికి దేవుడే దిక్కంటారు. ఇప్పుడు అమరావతి జనం పరిస్ధితి కూడా అలాగే మారిపోయింది. ప్రభుత్వం ఓవైపు దూకుడుగా మూడు రాజధానులపై ముందుకెళుతుంటే అమరావతి ప్రజలు న్యాయస్ధానాలవైపు చూస్తున్నారు. న్యాయస్దానాలకు పూజలు చేస్తున్నారు. న్యాయమూర్తుల ఫొటోలకు దండలేస్తున్నారు. మూడు రాజధానుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులను రద్దు చేయాలని కోర్టుల్లో న్యాయపోరాటం సాగిస్తున్నారు. ఇప్పటికే శాసన, కార్యనిర్వాహక ప్రక్రియలు పూర్తి చేసుకున్న మూడు రాజధానుల వ్యవహారం న్యాయ ప్రక్రియలో గట్టెక్కుతుందని అమరావతి గ్రామాల ప్రజలే కాదు విపక్షాలు సైతం ఎదురుచూస్తున్నాయి.