కలకలం: శ్రీవారి ఆలయం ఎదుట చిన్నారి కిడ్నాప్, సీసీ టీవీలో కనిపించిన దృశ్యాలు
తిరుమల శ్రీవారి ఆలయం ఎదుటే చిన్నారి కిడ్నాప్ కు గురవడం కలకలం రేపుతోంది. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. తెల్లవారాక నిద్రలేచి పక్కన తమ చిన్నారి లేకపోవడం గమనించిన దంపతులు భోరుమన్నారు.
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయం ఎదుటే చిన్నారి కిడ్నాప్ కు గురవడం కలకలం రేపుతోంది. గొల్లమండపం వద్ద తల్లిదండ్రుల పక్కనే నిద్రిస్తున్న ఏడాది వయసున్న చెన్నకేశవులు అనే బాలుడిని గుర్తు తెలియని వ్యక్తి అపహరించారు.
ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన వెంకటేష్ దంపతులు ఏడాది వయసున్న తమ చిన్నారితో శ్రీవారి దర్శనానికి వచ్చారు. మంగళవారి రాత్రి గొల్లమండపం వద్ద నిద్రించారు.
బుధవారం తెల్లవారాక నిద్రలేచి పక్కన తమ చిన్నారి లేకపోవడం గమనించిన దంపతులు భోరుమన్నారు. ఇతర భక్తులు వారిని ఓదార్చే ప్రయత్నం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పడంతో వారు వెంటనే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమీపంలోని సీసీ టీవీ ఫుటేజిలను పరిశీలించగా అందులో చిన్నారి కిడ్నాప్ కు సంబంధించిన దృశ్యాలు కనిపించాయి. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఆ బాలుడిని అపహరించినట్లు తెలుస్తోంది.
కిడ్నాప్ కు పాల్పడిన దంపతులు బస్టాండ్ నుంచి యాత్రికుల వసతి సముదాయం-2 వైపు వెళ్లినట్లు సీసీ టీవీ కెమెరాలు వెల్లడించాయి. సీసీ టీవీ ఫుటేజి దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టామని, చెన్నకేశవులు ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను నియమించామని పోలీసు అధికారులు తెలిపారు.