నోట్ల రద్దుపై మోడీకి 'సర్వే' షాక్!: చంద్రబాబు అసహనం, పవన్ కళ్యాణ్ ఆగ్రహం
రూ.500, రూ.1000 నోట్ల రద్దు పైన 'వన్ ఇండియా' ఆన్ లైన్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పాల్గొనన వారు నోట్ల రద్దును సమర్థిస్తూనే.. మరోవైపు రూ.2000 నోటు వల్ల బ్లాక్ మనీ మళ్లీ పుట్టుకు రావొచ్చునని,
విజయవాడ: రూ.500, రూ.1000 నోట్ల రద్దు పైన 'వన్ ఇండియా' ఆన్ లైన్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పాల్గొనన వారు నోట్ల రద్దును సమర్థిస్తూనే.. మరోవైపు రూ.2000 నోటు వల్ల బ్లాక్ మనీ మళ్లీ పుట్టుకు రావొచ్చునని, అలాగే కేంద్రం ముందస్తు చర్యలు తీసుకోలేదని అభిప్రాయపడ్డారు.
సర్వేల ఫలితాలు ఇటు అధికార పార్టీని సమర్థిస్తూనే, మరోవైపు విపక్షాల అభ్యంతరాలను లేవనెత్తినట్లుగా ఉన్నాయి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ల వ్యాఖ్యలకు ఈ సర్వేలు అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు.
ఇబ్బందులపై అసహనం
నవంబర్ 8వ తేదీన నరేంద్ర మోడీ నోట్ల రద్దు ప్రకటన చేసిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దానిని స్వాగతించారు. పది రోజుల తర్వాత మాత్రం ప్రజల ఇబ్బందుల దృష్ట్యా అసహనం వ్యక్తం చేశారు. పన్నెండు రోజులు అయినా సమస్య పరిష్కారం కాలేదంటూ ఓ విధంగా కేంద్రంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. నోట్ల రద్దును మాత్రం చంద్రబాబు స్వాగతించారు.
రూ.2000 నోటుపై చంద్రబాబు అభ్యంతరం
అలాగే, రూ.2000 నోటు పైన కూడా చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాని బదులు రూ.200 నోటు తీసుకు రావాలని సూచించారు. బ్లాక్ మనీ తగ్గించేందుకే పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు మళ్లీ రూ.2000 నోటు అనవసరమనేది చంద్రబాబు అభిప్రాయం.
ఇబ్బందులపై పవన్ ఆగ్రహం
మరోవైపు, జనసేన అధినేత నోట్ల నిర్ణయాన్ని స్వాగతించారు. నోట్ల రద్దు, రూ.2000 నోటు తీసుకు రావడంపై ఆయన నుంచి ఎలాంటి ఫిర్యాదు లేదు. అయితే, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా రద్దు ప్రకటన చేయడం వల్ల జనాలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
రూ.2000 నోటుపై అసంతృప్తి
ఇప్పుడు వన్ ఇండియా సర్వేలో పాల్గొన్న వారి అభిప్రాయాలు కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో ఏకీభవించేవిగా ఉన్నాయి. రూ.500 నోటు, రూ.1000 నోటు రద్దు చేసి రూ.2000 నోటు తీసుకు వస్తే బ్లాక్ మనీ హోల్డర్స్కు ఉపయోగపడుతుందని 51.7 శాతం మంది అభిప్రాయపడ్డారు. చంద్రబాబు వాదన కూడా ఇదే.
జాగ్రత్తలు తీసుకోలేదు
ఇక, ప్రభుత్వం ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా నోట్ల రద్దును ప్రకటించడం వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని 59.3 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ విషయంలోను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల ఆందోళన నిజమేనని అర్థమవుతోంది. సర్వేలో పాల్గొన్న ఎక్కువ మంది నెటిజన్లు జాగ్రత్తలు తీసుకోలేదని చెప్పారు.