అటు జీవియల్.. ఇటు ఐవైఆర్..! మద్యలో దేవేగౌడ..! రసపట్టు రాజకీయం అంటే ఇదే రాజా..!!
అమరావతి/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం టీడీపీ నాయకులు చంద్రబాబును మరోసారి ఎన్నుకోవాలని మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ పిలుపునిచ్చారు. పలు కేసుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ వైసీపీ అధినేత జగన్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, ఇదే సమయంలో రాష్ట్రం కోసం అహర్నిశలు చంద్రబాబు కృషి చేస్తున్నారని దేవె గౌడ ప్రసంశించారు. ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతివ్వాలని కోరారు. ఇదిలా ఉంటే బీజేపి ఎంపీ జీవియల్, మాజీ సీయస్ ఐవైఆర్ క్రిష్ణారావు లు టీడిపి పై మండిపడ్డారు. టీడిపి పార్టీ పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని మాజీ సీయస్ పేర్కొనగా. కేంద్ర పథకాలను తమపథకాలుగా ఆపాదించుకునే ప్రయత్నం చేసిన బాబుకు ఈ ఎన్నికల్లో చేదు అనుభవం తప్పదని జీవియల్ తెలిపారు.
టీడిపి అదికారం లోకి రావడం కష్టమంటున్న బీజేపి..! బాబుకే మళ్లీ అవకాశం అంటున్న మాజీ ప్రధాని..!!
మాజీ ప్రధాని దేవె గౌడ చంద్రబాబు పై ఉన్న సాన్నిహిత్యాన్ని మరోసారి చాటుకున్నారు. అమరావతిలో మాట్లాడుతూ ఆయన ఏపి ప్రజలు చంద్రబాబుకు మరో అవకాశం ఇవ్వాలని కోరారు. పేపర్ బ్యాలెట్ కోసం తాము చేస్తున్న పోరాటం కొనసాగుతుందని దేవెగౌడ తెలిపారు. మోదీ ప్రభుత్వం దేశంలోని వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తోందని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కూటమి బలంగా ఉందని తెలిపారు. రాజకీయ ప్రత్యర్థులపై ఐటీ శాఖను ఉసిగొలుపుతున్నారని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలను ఏక తాటిపైకి తెచ్చిన ఘనత చంద్రబాబుదేనని చెప్పారు.
ఐవైఆర్ కృష్ణారావు జోష్యం..! జనసేన ప్రభావాన్ని కొట్టిపారేసిన మాజీ సీయస్..!!
టీడీపీ అనుకూల మీడియా చేసిన ప్రచారం బెడిసికొట్టిందని బీజేపీ నాయకులు ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేత, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు జనసేనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను సానుకూలంగా మలచుకోవడంలో జనసేన చేచేతులా పోగొట్టుకుందని వ్యాఖ్యానించారు. ఏపీలో తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత ఉందన్నారు. సోమవారం ఐవైఆర్ కృష్ణారావు ట్విట్టర్ లో స్పందిస్తూ, గత రెండు రోజులుగా ఎన్నికల ప్రచారంలో లో భాగంగా క్షేత్రస్థాయిలో తిరిగాను. ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. దానిని తమకు అనుకూలంగా మలుచుకునే సదవకాశాన్ని జనసేన చేజేతులా వదులుకుంది. బీజేపీపై బాబు గారు వారి అనుకూల మీడియా చేసిన అబద్ధపు ప్రచారాలు పని చేయలేదు. ఫలితాలు అనూహ్యంగా ఉండొచ్చు, అని ట్వీట్ చేశారు.
బీజేపి బలంగా ఉంది..! ఏపిలో సత్తా చూపిస్తామంటున్న జీవీయల్..!!
బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తు లేదని ఆ పార్టీ నాయకులు జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... టీడీపీ నేతలే ఐటీ దాడులు చేయించుకుని డ్రామాలాడుతున్నారని, ప్రత్యేక హోదా అనేది అంతరించిన అంశం అని, ఏపీకి లోటు బడ్జెట్ ఉన్న 22,130 కోట్లు రూపాయలు ఇచ్చామని, ప్రత్యేక ప్యాకేజ్ కింద 17,500 కోట్లు రూపాయలు ఇచ్చామని అన్నారు. గత పాలకులు ప్రకాశం జిల్లాపై పూర్తిగా వివక్ష చూపించారని విమర్శించారు.
బీజేపీ పై బాబు అబాండాలు..! ప్రజలు తిరస్కరిస్తారన్న కమల నేతలు..!!
ఏపీలో ఐదేళ్ల పాలన అవినీతిమయం అన్న విషయం ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తోందని, ఎందుకంటే, ఐదేళ్లలో ఎటువంటి అభివృద్ధి చేయకుండా, అడ్డగోలుగా అన్ని స్కీంల్లోనూ స్కాంలు చేసి, బడా బాబులుగా టీడీపీ నేతలు తయారయ్యారని ఆరోపించారు. ఏపీలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కేంద్రప్రభుత్వం చలువేనని అన్నారు. పేద ప్రజల కోసం తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వ పథకాలపై తన స్టిక్కర్ వేసుకునేందుకు ప్రయత్నించిన చంద్రబాబు ఓ స్టిక్కర్ బాబు అని విమర్శించారు.