కృష్ణా జిల్లాలో ఓఎన్జీసి ఆధ్వర్యంలో...గ్యాస్ నిక్షేపాల వెలికితీత ప్రారంభం
కృష్ణాజిల్లా లోని నాగాయలంక మండలం వొక్కపట్లవారి పాలెంలో గ్యాస్ నిక్షేపాల వెలికితీత కార్యక్రమం ఓఎన్జిసి ఆధ్వర్యంలో మంగళవారం నుండి ప్రారంభమైంది. ఓఎన్జిసి సిఎండి శశిశంకర్ ఎర్లి ప్రొడక్షన్ సిస్టం శిలాఫలకాన్ని ఆవిష్కరించి అనంతరం సిస్టం చక్రాన్ని ఆన్చేసి గ్యాస్ ఉత్పత్తిని ప్రారంభించారు.
గ్యాస్ రింగ్ నుంచి మంటలు పైకి రావడంతో గ్యాస్ ట్రాన్స్పోర్టును నాచ్యురల్ గ్యాస్ కంప్రెషింగ్ స్టేషన్నూ వెంటనే ప్రారంభించారు. ఈ సందర్భంగా శశిశంకర్ మాట్లాడుతూ నాగాయలంక ప్రాంతంలో ఓఎన్జిసి, వేదాంత ప్రయివేటు లిమిటెడ్ సంయుక్త సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. వొక్కపట్లవారిపాలెంలోని మూడు బావుల్లో చమురు వాయువుల వెలికితీతకు కేంద్రప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని, తొలుత 40 మిలియన్ బ్యారల్స్ చమురు నిక్షేపాలను తీసేందుకు అనుమతి ఇచ్చిందని తెలిపారు.
రాష్ట్రం అభివృద్దికి...ఇక్కడే వినియోగం
ఓఎన్జిసి, కెయిర్న్ ఎనర్జియా ఇండియా సహకారంతో గ్యాస్, ఆయిల్ నిక్షేపాలు గురించి ఈ ప్రాంతంలో పరీక్షలు నిర్వహించగా మిలియన్ బ్యారళ్ల చమురు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించామని ఓఎన్జిసి సిఎండి శశిశంకర్ ఈ సందర్భంగా చెప్పారు. చమురు సహజ వాయువు నిక్షేపాల వెలికితీత అనుమతులకు ఎదురైన అవరోధాలను ఏపీ భవన్ ఢిల్లీ కమిషనర్ అర్జా శ్రీకాంత్ పూనుకుని పరిష్కారానికి విశేషంగా కృషి చేశారని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఉత్పత్తి అయ్యే గ్యాస్ చమురును ఇక్కడే వినియోగించాలన్నారు.
చమురు మార్కెట్ లో...భారీ విలీనం
అనంతరం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పర్యటన సందర్భంగా ఒఎన్జిసి బేస్ కాంప్లెక్స్లో ఓఎన్జిసి సిఎండి శశిశంకర్ మీడియాతో మాట్లాడారు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పిసిఎల్), మంగ్లూర్ రిఫైనరీ ప్రయివేట్ లిమిటెడ్ (ఎంఆర్పిఎల్)ను ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్ (ఒఎన్జిసి)లో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభమైందని ఓఎన్జిసి సిఎండి శశిశంకర్ తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయేందుకు రెండేళ్లు పట్టొచ్చన్నారు. హెచ్పిసిఎల్లో ఒఎన్ జిసి వాటా 51 శాతం ఉందన్నారు. హెచ్పిసిఎల్, ఎంఆర్పిఎల్, ఒఎన్జిసిలో విలీనం కావడం చమురు మార్కెట్లో భారీ విలీనంగా చెప్పుకోవచ్చన్నారు.
80 శాతం దిగుమతి...20 శాతం ఉత్పత్తి
ప్రస్తుతం దేశంలో 24 బిలియన్ క్యూబిక్ మీటర్ల (బిసిఎం) గ్యాస్ ఉత్పత్తి జరుగుతోందని, రానున్న మూడేళ్లలో 50 బిసిఎం గ్యాస్ ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించామని శశిశంకర్ తెలిపారు. దేశంలో వినయోగంలో ఉన్న చమురులో 80 శాతం దిగుమతి చేసుకుంటున్నదేనని చెప్పారు. 20 శాతమే మన దేశంలో ఉత్పత్తి అవుతుందన్నారు. ఈ 20 శాతం ఉత్పత్తిలో ఒఎన్జిసి ఒక్కటే 70 శాతం ఉత్పత్తి చేస్తోందని వివరించారు. మరోవైపు కాకినాడ డీప్ వాటర్లో చమురు నిక్షేపాల కోసం అన్వేషణ పూర్తయిందని, 2019 నాటికి కాకినాడ ఆఫ్షోర్లో ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు.
విదేశాల్లో...ఒఎన్జిసి
చమురు, సహజవాయువు ఉత్పత్తి విషయంలో ఈస్ట్కోస్ట్పై దృష్టి సారించామని, గతేడాది డీప్ వాటర్లో చమురు, సహజవాయువు అన్వేషణకు రూ.35 వేల కోట్లు ఖర్చు చేశామని శశిశంకర్ తెలిపారు. షెల్ గ్యాస్పై ప్రస్తుతం దృష్టి సారించడం లేదని చెప్పారు. ఒఎన్జిసి విదేశీ లిమిటెడ్ 19 దేశాల్లో 40 ప్రాజెక్టులు చేపట్టిందని తెలిపారు. చైనాతో కలిసి ఒఎన్జిసి కొన్ని ప్రాజెక్టులు చేపట్టిందని, ఒఎన్జిసి ప్రాంతీయ కార్యాలయాలు మార్చే అవకాశం లేదని, అవన్నీ చెన్నైలో ఉన్నప్పటికీ అన్ని పనులూ ఇక్కడి నుంచే జరుగుతున్నాయ న్నారు. దేశవ్యాప్తంగా 500 బావుల్లో ఉత్పత్తి జరుగుతోందన్నారు.