అనుమానితులే బాధితులు ! కరోనా కేసుల్లో గుంటూరు టాప్ ప్లేస్ వెనుక?
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి విశ్వరూపం చూపుతోంది. ఇవాళ ఉదయం ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం ఏపీ 500 మార్క్ కూడా దాటేసింది. ఇందులో ఒక్క గుంటూరు జిల్లాలోనే 118 కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. జిల్లా మరో ఆరుగురు కరోనా కారణంగా మృత్యువాత పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ కేసుల తీవ్రత వెనుక కారణాలపై మాత్రం చర్చ జరుగుతోంది.
కరోనా కేసుల్లో గుంటూరు టాప్ ప్లేస్ వెనుక.?
ఏపీలో కరోనా కేసుల్లో గుంటూరు జిల్లా 118 కేసులతో అగ్రస్ధానంలో నిలవడం వెనుక ప్రధాన కారణం ఢిల్లీలోని మర్కజ్ కు వెళ్లి వచ్చి వారే అన్నది అధికారులు ఇప్పటికే గుర్తించారు. అయితే వెళ్లిన వారి కంటే బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటానికి కారణం మాత్రం వారి నుంచి వైరస్ సోకిన ప్రాథమికంగా సన్నిహితంగా మెలిగిన వారే. వీరి కారణంగా ప్రస్తుతం కరోనా వైరస్ గణాంకాల్లో గుంటూరు టాప్ ప్లేస్ కు చేరుకుంది. మూడు రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ఇద్దరు చనిపోవడం కలకలం రేపుతోంది.
అనుమానితులే బాధితులుగా..
వాస్తవానికి ఢిల్లీ మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారి నుంచి ప్రాధమికంగా వైరస్ సోకిన వారిని అనుమానితులుగా క్వారంటైన్ కు తరలించారు. వీరిలో ఎక్కువ మందికి కరోనా లక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వీరు మినహా కొత్తగా ఒక్కరు కూడా బాధితులుగా మారలేదంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఇప్పటికే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో క్వారంటైన్ లో ఉంచిన వారికి నిర్వహిస్తున్న పరీక్షల్లోనే కొత్త కేసులన్నీ బయటపడుతున్నాయి. వీరిలో నుంచే ఇద్దరు మృత్యువాత పడ్డారు.
కేసులున్నా అదుపులోనే పరిస్ధితి..
గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ అవన్నీ ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాల నుంచే వస్తున్నవి కావడంతో అధికారులు ఊపిరిపీల్చుకుంటున్నారు. కొత్తగా బయటి నుంచి ఒక్క కేసు కూడా రాకపోవడాన్ని బట్టి చూస్తే పరిస్దితి ప్రభుత్వం అదుపులోనే ఉన్నట్లు అర్దమవుతోంది. కాబట్టి క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్న వారికి మరికొన్ని రోజుల్లో పరీక్షలు పూర్తి చేస్తే గుంటూరు జిల్లాలో కరోనా ప్రభావం అదుపులోకి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరికొన్ని రోజుల పాటు బయటి నుంచి కొత్త కేసులు రాకపోతే జిల్లాల్లో రెడ్ జోన్ ప్రాంతాల్లోనూ మార్పులు ఉండొచ్చని అధికారులు చెప్తున్నారు.
Recommended Video