ఐదుగురే మిగులుతారు: వైసీపీపై అచ్చెన్న సంచలనం, జగన్కు షాక్ తప్పదా?
ఇడుపులపాయ నుంచి జగన్ చేపట్టిన పాదయాత్ర వల్ల తమ ప్రభుత్వానికి, పార్టీకి వచ్చిన నష్టమేమి లేదని మంత్రి అచ్చెన్న అన్నారు.
విజయవాడ: నంద్యాల ఉపఎన్నిక తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ జోరు పెంచిన టీడీపీ.. మున్ముందు వైసీపీని ఖాళీ చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు కూడా ఇదే విషయాన్ని బలపరుస్తున్నాయి.
వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర ముగిసేసరికి ఆయన కుటుంబ సభ్యులతో పాటు వైసీపీలో మరో ఐదుగురు మాత్రమే మిగులుతారని అచ్చెన్న జోస్యం చెప్పారు.
మాకేం నష్టం లేదన్న అచ్చెన్న
ఇడుపులపాయ నుంచి జగన్ చేపట్టిన పాదయాత్ర వల్ల తమ ప్రభుత్వానికి, పార్టీకి వచ్చిన నష్టమేమి లేదని మంత్రి అచ్చెన్న అన్నారు. జగన్ అసెంబ్లీని బహిష్కరించి పాదయాత్ర చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ పోషించాల్సిన పాత్రను 1100కాల్ సెంటర్ నిర్వహిస్తోందని ఎద్దేవా చేశారు.
టీడీపీ ఆకర్ష్:
అనుకున్నట్టుగానే నంద్యాల ఉపఎన్నిక తర్వాత అధికార పార్టీ ఆకర్ష్ మంత్రాన్ని మరోసారి స్పీడప్ చేసింది. ఫలితంగా కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి కండువాలు మార్చేశారు. ఉన్న కొద్దిమంది నేతల్లోను కాస్తో.. కూస్తో.. అభద్రతా భావం పేరుకుపోయింది. పాదయాత్ర ద్వారా ఆ అభద్రతను పోగొట్టాలని జగన్ భావిస్తుంటే.. ప్రజా సంకల్ప యాత్ర ముగిసేనాటికి జగన్ పార్టీని ముంచాలని టీడీపీ భావిస్తోంది. ఆలోగా వీలైనన్ని వలసలను ప్రోత్సహించాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
లాగేందుకు ప్రయత్నాలు
వలసలను ప్రోత్సహించే విషయంలో పార్టీలోని కొంతమంది కీలక నేతలు అదే పని మీద ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ నేతలతో టచ్ లోకి వెళ్లి.. వారితో బేరసారాలు జరపడానికి ప్రయత్నిస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారి ప్రయత్నాలు ఫలిస్తే.. రాబోయే కాలంలో వైసీపీకి మరింత గట్టి దెబ్బ తగలనుంది. పాదయాత్ర హడావుడిలో జగన్ దీనిపై ఫోకస్ చేస్తున్నారో లేదో తెలియడం లేదు. టీడీపీ సైతం ఇదే సమయాన్ని అదునుగా భావించి.. వీలైనంత మందిని లాగాలని చూస్తోంది.
ఆ ధీమాతోనే:
వైసీపీ నేతలను టీడీపీలోకి లాగుతామన్న ధీమాతోనే మంత్రి అచ్చెన్నాయుడు.. ఆ పార్టీలో కేవలం ఐదుగురు మాత్రమే మిగులుతారని కామెంట్ చేశారనుకోవచ్చు. ఆపరేషన్ ఆకర్ష్ బాధ్యతలను అప్పట్లో చంద్రబాబు ఆయనకు అప్పగించినట్టు ప్రచారం జరిగింది. తాజా వ్యాఖ్యలను బట్టి అచ్చెన్న అదే పనిలో ఉన్నట్టు అర్థమవుతోంది. ఎన్నికల నాటికి వైసీపీని జీరో చేయాలన్న లక్ష్యంతోనే టీడీపీ నేతలు ఆకర్ష్ జోరు పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. అచ్చెన్న చెబుతున్నట్టుగానే మరికొంతమంది నేతలు వైసీపీని వీడితే.. అది పార్టీకి, ముఖ్యంగా జగన్ కు పెద్ద దెబ్బే అని చెప్పాలి.