జగన్తో రోజా మాత్రమే మిగులుతుంది, శిఖండిలా..: ఆనం వివేకా
నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. ఓ రాజకీయ శిఖండిలా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
నెల్లూరులోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే రోజాను ఓ శక్తిగా భావిస్తూ ఆమెను అడ్డం పెట్టుకుని జగన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన వ్యవహారశైలి, ఉన్మాద చర్యలపై తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వైసీపీ నేతలు ఆ పార్టీ వీడుతున్నారని తెలిపారు.
జగన్ వెంట నిలిచేది ఒక్క రోజానేనని చెప్పారు. ఓ యువకుడి వద్ద జగన్ జోష్యం చెప్పించుకున్నాడని మొదట్లో ఏం సంపాదించావో అదే మిగులుతుందని చెప్పాడని ఆఖరికి మిగిలేది ఏమీ ఉండదని ఎద్దేవా చేశారు.
అవినీతి కుంభకోణాలు, కేసుల నుంచి బయటపడేందుకే జగన్ ముఖ్యమంత్రి కావాలని భావిస్తున్నారన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో వినాశకర విధానాలకు పాల్పడుతున్నారని ఆనం వివేకానంద రెడ్డి దుయ్యబట్టారు.