ఆ ముగ్గురే: టీడీపీతో పొత్తుపై కామినేని షాక్, 'బోండా ఉమ వెనుక చంద్రబాబు'
Recommended Video
అమరావతి: వచ్చే ఎన్నికల్లో తెలుగదేశం పార్టీతో పొత్తు అంశంపై తేల్చాల్సింది ముగ్గురేనని రాష్ట్ర మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ మంగళవారం అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడులు మాత్రమే తేల్చాల్సిన విషయమన్నారు.
25 మంది కీలక నేతలతో భేటీ, త్వరలో పూర్తి వివరాలు: త్వరలో పవన్ సంచలన ప్రకటన?
కామినేని ఈ వ్యాఖ్యల ద్వారా అటు టీడీపీకి, ఇటు సొంత పార్టీ నేతలకు కూడా షాకిచ్చారని చెప్పవచ్చు. టీడీపీతో పొత్తు వద్దని కోరుకుంటున్న బీజేపీ నేతల్లో సోము వీర్రాజు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. ఇటీవల బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నేతలకు కూడా షాకిచ్చేలా కామినేని వ్యాఖ్యలు ఉన్నాయి.
అందరిదీ అదే మాట
అయితే, పార్టీకి చెందిన పురంధేశ్వరి, విష్ణు, సోము వీర్రాజులు కూడా పొత్తులపై ఇదే అభిప్రాయంతో ఉన్నారు. తమకు పొత్తు ఇష్టం లేకపోయినప్పటికీ తమ పార్టీ అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి ఉంటామని చెబుతున్నారు. ఇప్పుడు కామినేని కూడా అదే చెప్పారు. పొత్తుపై తేల్చాల్సింది ఆ ముగ్గురే అన్నారు.
ఈ లోపు ఇలా సరికాదు
కామినేని ప్రకాశం జిల్లా ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. బీజేపీ, టీడీపీ మిత్రపక్షంగా ఎన్నికల్లో పోటీ చేయగా ప్రజలు అయిదేళ్లు పాలించేందుకు అధికారం ఇచ్చారని చెప్పారు. ఈ లోపలే లేనిపోని వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. ఏదైనా ఉంటే అంతర్గత సమావేశాల్లో చర్చించుకోవాలని చెప్పారు.
స్థాయి మరిచి మాట్లాడవద్దు
ఇటీవల శ్రీధర్ అనే వ్యక్తి బీజేపీ నాయకుడిని అని చెప్పుకుంటూ టీవీల్లో చర్చా వేదికల్లో మాట్లాడారని, త్వరలో ఇద్దరు రాష్ట్ర మంత్రులను మార్చబోతున్నారని చెప్పారని, కానీ ఆ వ్యక్తి హోదా గురించి ఆరా తీస్తే పార్టీలో ఉన్నాడో లేడో తెలియని పరిస్థితి అన్నారు. అలా స్థాయి మరిచి మాట్లాడకూడదనేది తమ సిద్ధాంతమని చెప్పారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తోందని, పట్టిసీమ వల్ల రెండు జిల్లాల్లో రైతులు పంటలు పండించుకుంటున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.
అశోక్ గజపతి రాజు సమాధానం చెప్పాలి
వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మంగళవారం చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) దాఖలు చేసిన బిడ్ను రాష్ట్ర మంత్రి మండలి రద్దు చేయడం వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉందన్నారు. దీనిపై ప్రధాని మోడీకి రాసిన లేఖను ఆయన మీడియాకు చూపించారు. విమానాశ్రయం నిర్మాణానికి 2016లో టెండర్లు పిలవగా ఏఏఐతో పాటు మరో ప్రయివేటు సంస్థ బిడ్లు వేశాయని, విమానాశ్రయానికి వచ్చే ఆదాయంలో ఏఏఐ సంస్థ 30.2 శాతం, ప్రయివేటు సంస్థ 21.6 శాతం ప్రభుత్వానికి ఇస్తామని బిడ్లో పేర్కొన్నాయని, అధిక మొత్తం ఇస్తామన్న ఏఏఐకే బిడ్ దక్కిందని, ఏఏఐ ప్రభుత్వ సంస్థ కావడంతో ముడుపులు దక్కే అవకాశం ఉండదని ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ఆ బిడ్ను రద్దు చేశారని, భూసేకరణ, ఎకనమిక్ జోన్తో కలిపి ఎయిర్ పోర్ట్ నిర్మిస్తామని సాకులు చెప్పారని, దీనిపై కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బోండా ఉమ వెనుక చంద్రబాబు హస్తం
బెజవాడలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు కబ్జాల వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తం ఉందని బొత్స ఆరోపించారు. వాక్ విత్ జగన్ కార్యక్రమానికి మంచి స్పందన రావడాన్ని తట్టుకోలేక మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.. జోగి రమేష్పై అక్రమంగా కేసు పెట్టారన్నారు. ఇబ్రహీంపట్నంలో గుండెపోటుతో కార్యకర్త మృతి చెందితే ర్యాలీ వల్లే జరిగిందని చెప్పడాన్ని తప్పుబట్టారు.