దిగ్విజయ్ అవుట్: కాంగ్రెస్ ఏపీ ఇంచార్జీగా ఉమెన్ చాందీ, బలపడేనా?
విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ జాతీయ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు ఇంఛార్జీగా వ్యవహరించిన దిగ్విజయ్ సింగ్ స్థానంలో మార్పులు చేసింది. గతంలోనే తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహరాల ఇంచార్జీగా ఉన్న దిగ్విజయ్ స్థానంలో కుంతియాకు బాధ్యతలను అప్పగించారు. తాజాగా ఏపీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీగా కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీని నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది.
కాంగ్రెస్ పార్టీ 2004 నుండి 2014 వరకు కేంద్రంలో అధికారంలో ఉండేందుకు ఉమ్మడి ఏపీ రాష్ట్రం కీలకంగా వ్యవహరించింది. 2009 తర్వాత ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. దీంతో తెలంగాణకు అనుకూలంగా ఎన్నికల్లో తీసుకొన్న నిర్ణయానికి అనుకూలంగా 2014 ఎన్నికలకు ముందుగా అప్పటి కాంగ్రెస్ పార్టీ నేతృథ్వంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో 2014 ఎన్నికల్లో తెలంగాణలో ప్రయోజనం పొందుతామని కాంగ్రెస్ భావించింది. కానీ, టిఆర్ఎస్ కు ప్రజలు పట్టంకట్టారు. కానీ, ఈ దఫా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు గాను కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది.
మరోవైపు రాష్ట్రాన్ని విడగొట్టిందనే కారణంగా కాంగ్రెస్ పార్టీని ఏపీ రాష్ట్రంలో ప్రజలు ఒక్క సీటులో కూడ గెలిపించలేదు. అయితే ఏపీ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను ప్రారంభించింది.
తెలంగాణలో కుంతియా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీల నుండి వలసలు ప్రారంభమయ్యాయి. పార్టీని బలోపేతం చేసే ప్రక్రియను ఆ పార్టీ నేతలు చేపట్టారు. ఇదే క్రమంలో ఏపీ రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జీ బాధ్యతల నుండి దిగ్విజయ్ సింగ్ స్థానంలో కేరళ రాష్ట్ర మాజీ సీఎం ఉమెన్ చాందీని నియమిస్తూ ఎఐసీసీ అద్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం నాడు నిర్ణయం తీసుకొన్నారు.
వచ్చే ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీని బలోపేతం చేసేందుకు ఈ మార్పులు చేసినట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మేరకు ఆదివారం నాడు పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు ఏపీ కాంగ్రెస్ ఇన్చార్జ్గా ఉన్న దిగ్విజయ్సింగ్ ప్రశంసనీయమైన సేవలు అందించారని, ఆయన వెంటనే ఆ పదవి నుంచి దిగిపోతారని తెలిపింది.ఎంపీ తరుణ్ గగోయ్ ను పశ్చిమబెంగాల్, ,అండమాన్ నికోబార్ లకు ఇంఛార్జీగా నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకొన్నారు.
ఈ మార్పుల కారణంగా ఏపీలో పార్టీ బలపడేనా అనే చర్చ సాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రత్యేక హోదా అంశంపై ఇతర పార్టీలతో కలిసి ఆందోళనలు నిర్వహించింది. ఇంచార్జీ మార్పు ఏ మేరకు ఆ పార్టీకి కలిసివస్తోందో చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.