జగన్ మాట మార్చారు: కాపుల రిజర్వేషన్లపై యూటర్న్ అంటూ ఊమెన్ చాందీ ఫైర్
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కాపుల రిజర్వేషన్ల విషయంలో యూటర్న్ తీసుకున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ ఊమెన్ చాందీ ఆరోపించారు. కాకినాడ పర్యటన కోసం బెంగుళూరు నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఆయనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.
చేసేదే చెప్తా, తప్పుడు వాగ్ధానాలివ్వను : కాపు రిజర్వేషన్లపై తేల్చేసిన వైయస్ జగన్
విమానాశ్రయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని నాలుగేళ్లుగా చెబుతున్న జగన్.. ఇప్పుడు మడమ తిప్పారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కాపులకు అండగా ఉంటుందన్నారు.
వచ్చే ఎన్నికల్లో కాపులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలను తిరిగి తీసుకొచ్చే ప్రక్రియ వేగంగా సాగుతున్నట్లు చాందీ తెలిపారు.
2019 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ కీలకపాత్ర పోషించడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రత్యేక హోదాకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తుందో.. కాపులకూ అంతే ప్రాధాన్యత ఇస్తుందని చాందీ స్పష్టం చేశారు. కాగా, కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని సాధ్యం కాని హామీలను తాము ఇవ్వలేమని ఇటీవల జగన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.