రాహుల్ చెప్పారు, నాకు మిత్రుడు.. వస్తాడు: ఊమెన్, సరైన టైంలో చెప్తా: కిరణ్ రెడ్డి
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ ఊమెన్ చాందీ ఆదివారం భేటీ అయ్యారు. కిరణ్ రెడ్డిని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఇటీవల తనను కలిసిన పళ్లంరాజుతో.. తాను ఊమెన్ చాందితో మాట్లాడుతానని కిరణ్ రెడ్డి చెప్పారు.
2019లో ఎవరికి షాకిస్తారు: జగన్ను నిన్న పవన్ కళ్యాణ్ దెబ్బకొడితే నేడు వీరు కొడతారా!?
ఆ మరుసటి రోజు మరో సీనియర్ నేత టీ సుబ్బిరామి రెడ్డి భేటీ అయి.. ఆయన (కిరణ్ రెడ్డి) చేరిక దాదాపు ఖాయమైందన్నారు. ఈ నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కిరణ్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా ఆ తర్వాత ఊమెన్ చాందితో భేటీ కానున్నారు.
కిరణ్ రెడ్డి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది
కిరణ్ రెడ్డితో భేటీ నేపథ్యంలో ఊమెన్ చాందీ స్పందిస్తూ... పార్టీని వీడిన నాయకులను మళ్లీ కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. తమ ఆహ్వానంపై కిరణ్ కుమార్ రెడ్డి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. విబేధాలు పక్కన పెట్టి దేశం కోసం ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు.
కిరణ్ రెడ్డి నాకు మిత్రుడు, చేరితే బాగుంటుంది
పార్టీ నుంచి వెళ్లిన వారిని తాము ఆహ్వానిస్తున్నామని ఊమెన్ చాందీ తెలిపారు. కిరణ్ రెడ్డి తనకు మంచి స్నేహితుడని చెప్పారు. ఆయనను కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించామన్నారు. కిరణ్ చేరితో బాగుంటుందన్నారు. కిరణ్ సానుకూల నిర్ణయం తీసుకుంటారని తాను ఆశిస్తున్నానని తెలిపారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే తమ లక్ష్యమన్నారు.
సస్పెన్స్లో పెట్టిన కిరణ్ రెడ్డి
ఊమెన్ చాందితో భేటీ తర్వాత కిరణ్ రెడ్డి మాట్లాడుతూ... సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు వెల్లడిస్తానని తెలిపారు. కిరణ్ రెడ్డి మాటలను బట్టి ఆయన మనసులో ఏముందో అర్థం కావటం లేదని అంటున్నారు. సమయం వచ్చినప్పుడు చెబుతాననడం ద్వారా ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పడమే.
రాహుల్ గాంధీ చెప్పారు, కిరణ్ను ఆహ్వానించారు
పార్టీ వీడిన వారిని తిరిగి ఆహ్వానించాలని పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ చెప్పారని పళ్లంరాజు అన్నారు. అందులో భాగంగా కిరణ్ రెడ్డిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారని అన్నారు. రాష్ట్ర ప్రజలు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. పార్టీ బలోపేతం కావాలంటే నాయకత్వం కూడా బలంగా ఉండాలన్నారు.
కిరణ్ లాంటి నేతల నిర్ణయానికి కొంత సమయం
కిరణ్ కుమార్ రెడ్డి వంటి నేతలు నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పడుతుందని పళ్లంరాజు అన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. అన్ని పార్టీల అభిప్రాయం మేరకే నాడు రాష్ట్ర విభజన జరిగిందన్నారు. ఏపీ అభివృద్ధి కోసం విభజన చట్టంలో అనేక అంశాలను పొందుపర్చామన్నారు. కానీ వాటిని అమలు చేయడంలో ఎన్డీయే ప్రభుత్వం విఫలమైందన్నారు.