జోరుగా ఆపరేషన్ పరివర్తన: గత 36 రోజుల్లో ఎంత గంజాయి ధ్వంసం చేశారో తెలిస్తే షాక్!!
ఏపీలో గంజాయిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపధ్యంలో ఆపరేషన్ పరివర్తన పేరుతో జగన్ సర్కార్ గంజాయి నిర్మూలన పై దృష్టి సారించింది. గంజాయి సాగు విచ్చలవిడిగా జరుగుతుందని, గంజాయి సాగును ధ్వంసం చేయడం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టే క్రమంలో రాష్ట్రంలో విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల సరిహద్దుల్లో సాగవుతున్న గంజాయి పంటను ధ్వంసం చేస్తుంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గంజాయిని సమూలంగా నాశనం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన క్రమంలో అధికారులు గంజాయి క్షేత్రాలపై విరుచుకుపడుతున్నారు. ఎక్కడ గంజాయి పంటలు కనిపించినా వాటిని నాశనం చేస్తున్నారు.
ఆగని గంజాయి దందా: విశాఖ నుండి మహారాష్ట్రకు తరలిస్తున్న 3కోట్ల విలువైన భారీ గంజాయి పట్టివేత!!
ఆపరేషన్ పరివర్తన .. ఇప్పటివరకు 15 వందల కోట్ల గంజాయి తోటల ధ్వంసం
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా గంజాయిని ధ్వంసం చేయటం పై దృష్టిసారించిన పోలీసులు తాజాగా 5,962 ఎకరాల్లో వేసిన 29 లక్షల 82 వేల 425 గంజాయి మొక్కలను నాశనం చేశారు. గత 36 రోజులుగా ఆపరేషన్ పరివర్తన లో భాగంగా ఇప్పటివరకు ఒక 1,491 కోట్ల రూపాయల విలువైన గంజాయి పంట ధ్వంసం చేసినట్లుగా ఒక అంచనా. ఇప్పటికే విశాఖ మన్యంలో, ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాలలో దాడులు చేసిన పోలీసులు ఎక్కడెక్కడ గంజాయి సాగు అవుతుందో గుర్తించారు. పక్కా ప్రణాళిక ప్రకారం గంజాయి క్షేత్రాలపై దాడులు చేస్తూ పంటను ధ్వంసం చేస్తున్నారు.
గిరిజనులకు ఉపాది మార్గాలు చూపిస్తున్న అధికారులు
టెక్నాలజీ, ఎన్ ఫోర్స్ మెంట్, ఇంటెలిజెన్స్, పోలీస్ డిపార్ట్మెంట్ లు సంయుక్తంగా గంజాయి పంటను నిర్మూలించటానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇదే సమయంలో గంజాయి సాగు చేస్తున్న గిరిజనులకు అవగాహన కల్పించడంతో పాటు, వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా గంజాయి క్షేత్రాలపై దాడులు కొనసాగిస్తున్న అధికారులు గిరిజనుల నుండి వ్యతిరేకత తో పాటు, అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ గంజాయి కట్టడి కోసం ముందుకు సాగుతున్నారు.
ఏపీ ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గంజాయి తోటల సాగు
ఇదిలా ఉంటే గత వారం కొంధమాల్ జిల్లా బలిగుడ పోలీస్ స్టేషన్ పరిధిలో అడిమహ పంచాయతీలోని జర్గిసుగ, సవుటి, కుకుడుప గ్రామాల్లో అక్రమ గంజాయి తోటలపై పోలీసు, అబ్కారీ అధికారులు బుధవారం సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఆయాచోట్ల 145 ఎకరాల్లో గంజాయి తోటల్ని యంత్రాలతో కోసి, వాటికి నిప్పుపెట్టారు. అంతకుముందు మంగళవారం ఫిరింగియా పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ చోట్ల 171 ఎకరాల్లో గంజాయి తోటల్ని అధికారులు నాశనం చేశారు. వేర్వేరు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
నిత్యం ఎక్కడో ఒక చోట ఆపరేషన్ పరివర్తన .. గంజాయి సాగుపై ఉక్కుపాదం
అంతకు ముందు ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో తూర్పు గోదావరి జిల్లా పోలీసులు గంజాయి సాగుపై జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. పోలీసులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం చింతూరు సబ్ డివిజన్ మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపారు. అక్కడ ఒడియా క్యాంపులో నివసిస్తున్న చాలామంది గంజాయి సాగు చేస్తున్నారని గుర్తించిన పోలీసులు పది ఎకరాల్లో సాగు అవుతున్న గంజాయిని ధ్వంసం చేశారు. ఎకరానికి 5000 చొప్పున పది ఎకరాల్లో నాటిన సుమారు రెండు కోట్ల 50 లక్షలు విలువైన 50000 గంజాయి మొక్కలను పోలీసులు ధ్వంసం చేశారు. ఇదిలా ఉంటే విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి మండలం పెద్ద వలస పంచాయతీ పరిధిలోని గ్రామాలలో గంజాయి తోటలను పోలీసులు ధ్వంసం చేశారు. సుమారు 60 ఎకరాల్లో సాగు చేస్తున్న తోటలను ధ్వంసం చేసి నిప్పంటించారు.