బడ్జెట్ పై సామాన్యుడి మనోగతం...మొత్తం మీద అనాసక్తి
అమరావతి: కారణాలు ఏమైనప్పటికీ ఈ సారి రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులపై సామాన్యుడు అంతగా ఆసక్తి చూపలేదన్న విషయం చర్చనీయాంశంగా మారింది. కేంద్రం, రాష్ట్రం మధ్య నెలకొన్న విభేధాల వల్ల కావచ్చు...రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మీద ఉన్న అవగాహన వల్ల కావచ్చు...ఎలక్షన్ ముందు వస్తున్న బడ్జెట్ అనే కారణం కావచ్చు...ఏదేమైనప్పటికీ ఈ దఫా బడ్జెట్ పై కామన్ మ్యాన్ ఆసక్తి చూపలేదన్నది వాస్తవం.
Recommended Video
ఇక బడ్జెట్ కేటాయింపులపై కాస్తో కూస్తో అవగాహన ఉన్న వివిధ వర్గాలకు చెందిన సాధారణ జనాల నుంచి వారికి సంబంధించిన రంగాలపై అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేయగా మిశ్రమ స్పందన వ్యక్తం అయింది. అయితే అందరి మాటల్లోనూ నిధుల లభ్యతపైనే సందేహం వ్యక్తం అయింది. అలాగే నిధుల కేటాయింపు చూపడమే కాదు దాన్ని విడుదల జరగడంపై కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ముందుగా నిరుద్యోగ భృతి విషయానికొస్తే బడ్జెట్లో వారి కోసం 1000 కోట్లు కేటాయించారు. గుంటూరు నగరవాసి రాచమట్ల రవికుమార్ అనే నిరుద్యోగిని నిరుద్యోగ భృతి విషయమై అభిప్రాయం అడుగగా ఈ బడ్జెట్ ద్వారా నిరుద్యోగులకు భృతి ఎంతవరకు అందుతుందనే విషయంపై సందేహం ఉందన్నారు. కారణం రాష్ట్రంలో ఇంతవరకు నిరుద్యోగులు ఎంత అనే లెక్క తేల్చలేదని, ఆ ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందో, ఆ తరువాత విధివిధానాల నిర్ణయం జరగాలని, అంతా జరిగినా ఒక్కో నిరుద్యోగికి 1000 రూ మాత్రమే ఇవ్వగలరని...దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుందని అన్నారు.
రైతులకు కేటాయింపు విషయానికొస్తే అన్నదాతలు రుణమాఫి విషయంపైనే ఆసక్తి చూపుతున్న పరిస్థితి. గేరా కోటేశ్వరరావు అనే రైతును బడ్జెట్ కేటాయింపుల గురించి ప్రశ్నించగా ఎన్నికలు వస్తున్నందున రుణమాఫీ కొంతమందికైనా జరుగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకైతే బడ్జెట్ కేటాయింపులను అనుసరించి బడ్జెట్ విడుదల జరగలేదని చెప్పారు.
కాపు కార్పొరేషన్ కు నిధుల కేటాయింపు విషయమై పసుపులేటి ఆంజనేయులును అనే కాపు యువకుడిని ప్రశ్నించగా...గత ఏడాది రుణాలు అందరికీ అందలేదని, బ్యాంకులు సబ్సిడీ మొత్తాన్నే తప్ప ప్రాజెక్టు వ్యయాన్ని అనుసరించి రుణాలు ఇవ్వడం లేదన్నారు. గత ఏడాది బడ్జెట్లో కేటాయించిన విధంగా నిధులు విడుదల చేయలేదని, ఈ ఏడాది కూడా అంతేనని నిరాశ వ్యక్తం చేశారు. అందుకు ప్రభుత్వాన్ని తప్పుపట్టలేమని, రాష్ట్రం పరిస్థితి అంతేనని వ్యాఖ్యానించారు.
ఫైబర్ గ్రిడ్ విషయమై విద్యార్థి వాసిరెడ్డి నర్మద అనే బిటెక్ విద్యార్ధిని అభిప్రాయం అడుగగా ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. టిడిపి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ ను చేపట్టి నందున ఈ ఏడాది కచ్చితంగా ఆ ప్రాజెక్ట్ అమలులోకి వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. అయితే గత ఏడాదే ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తుందని ఆశించామని, టివి, మొబైల్, ఇంటర్నెట్ ఈ మూడు సేవలు ఒకే చోట లభ్యం కావడం విద్యార్ధులకు ఎంతగానో ఉపకరిస్తుందని చెప్పారు.
చేనేత కార్మికుడు తిరువీధుల పద్మయ్య బడ్జెట్ పై స్పందిస్తూ చేనేత కార్మికులకు ఈ బడ్జెట్ లో నేతన్నలకు నూలు పంపిణీపై హర్షం వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకు 42 కోట్ల రూపాయల కేటాయింపు ఏ మూలకు సరిపోదని అభిప్రాయపడ్డారు. చేనేతలకు ఇచ్చే పెన్షన్ రెట్టింపు చేయాలని కోరారు. గతంతో పోలిస్తే చేనేత కార్మికుల పరిస్థితి కొంతగా మెరుగైనట్లు అభిప్రాయపడ్డారు.
బిసి ఉప కార్యాచరణ ప్రణాళికకు 12 వేల కోట్లు కేటాయించడం, బిసి కార్పొరేషన్ కు 600 కోట్లుపై బిసి సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బిసి నేత సురేష్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు బిసిలకు ఎప్పుడూ అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని, అదుకే బిసిలు ఆయన వెంటే ఉంటారని...ఈసారి బడ్జెట్లో తమకు మరింత ఎక్కువ కేటాయింపులు జరిపినందుకు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే కేటాయింపుల ప్రకారం చంద్రబాబు తమ సంక్షేమం కోసం కృషి చేస్తారన్న నమ్మకం ఉందన్నారు.
మహిళా దినోత్సవం రోజున బడ్జెట్ ప్రవేశ పెట్టడమే కాకుండా ఈ బడ్జెట్ లో మహిళా సంక్షేమానికి రూ.2,839 కోట్లు కేటాయించడం ఎంతో సంతోషంగా ఫీలవుతున్నామని చెప్పారు మహిళా న్యాయవాది కందుకూరి సుజాత. ఎపి బడ్జెట్ లో మహిళల సంక్షేమం కోసం ఈ స్థాయిలో కేటాయింపులు ఎప్పుడూ జరిగినట్లు గుర్తు లేదన్నారు. అయితే మహిళా సంక్షేమం నిధులు దుర్వినియోగం కాకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు.
హిజ్రాల సంక్షేమం కోసం మరిన్ని నిధులు కేటాయిస్తామని ఆశించామని, కేవలం 20 కోట్లే కేటాయించడం కొంత నిరాశ కలిగించినా, గతంలో అసలు తమను పట్టించుకున్న వారే లేరని ట్రాన్స్ జెండర్ లలిత అభిప్రాయం వ్యక్తం చేసింది. తమకు ఆధార్, రేషన్ కార్డులు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని, తమ ఓటు చంద్రబాబు కేనని అన్నారు. చంద్రబాబు తమ పాలిట దేవుడని...ఆయన లాగా తమకు ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాలేదని, భవిష్యత్తులో చంద్రబాబు తమకు మరింత సాయం చేస్తారని నమ్మకం ఉందన్నారు.
అయితే బడ్జెట్ పై అభిప్రాయం కోరేందుకు ఎక్కువమందిని సంప్రదించినా చాలా మంది బడ్జెట్ కేటాయింపుల విషయమై ఆసక్తి చూపకపోవడం గమనార్హం. రాష్ట్రం పరిస్థితి బాగోలేదని, బడ్జెట్ లో కేటాయింపులు ఎలా జరిపినా నిధుల విడుదల అప్పటి పరిస్థితులను బట్టే ఉంటుందని అభిప్రాయపడటం గమనార్హం. పైగా ఇది ఎన్నికలు రాబోయే ముందు బడ్జెట్ కాబట్టి ఓటు బ్యాంకు రాజకీయాలకు అనుగుణంగా ఉంటుందని, అమలు వేరుగా ఉంటుందని అన్నారు. చాలామంది బడ్జెట్ కేటాయింపులు గత ఏడాది, ఈ ఏడాది గణాంకాలు తెలియచేసిన పిదప బేరీజు వేసుకొని అభిప్రాయాన్ని తెలపడం గమనార్హం. అలాగే రాష్ట్రంలో అత్యధికులు బడ్జెట్ కేటాయింపుల కన్నాతాజా రాజకీయ పరిణామాల గురించే ఎక్కువ ఆసక్తి కనబర్చడం విశేషం.