నవరత్నాలు నాణ్యత కోల్పోయాయా..? వైసీపి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విపక్షాలు..!!
అమరావతి/హైదరాబాద్ : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్పై మాజీ మంత్రి యనమల విమర్శలు చేశారు. నవరత్నాల పేరుతో నవ కోతలు, నవ రద్దులు చేశారని ఆరోపించారు. ఈ బడ్జెట్లో రద్దు చేసినవి, పేర్లు మార్చిన పథకాలు ఎన్నో ఉన్నాయని, అంత మాత్రన ప్రజల మనసుల నుంచి టీడిపిని తొలగించలేరని యనమల అన్నారు. బడ్జెట్లో ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు తగ్గించారని దుయ్యబట్టారు.
రద్దు చేసిన పాత పథకాలకే నవరత్నాల ముసుగు వేస్తున్నారని ఆరోపించారు. రీ-టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టు పనులు నిలుపుతున్నారని చెప్పారు. ఒక్క రోజు కూడా పనులు ఆపకూడదని టీడిపి ఆరాట పడిందని గుర్తు చేశారు. ప్రభుత్వ వైఖరి చూస్తుంటే కొత్త పరిశ్రమలు రావడం అటుంచితే ఉన్నవి పోయే ప్రమాదముందని యనమల విమర్శించారు. ఏపిలోని అఖిల పక్ష నేతలు కూడా వైసీపి ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై పెదవి విరుస్తున్నారు.
బడ్జెట్ పై పెదవి విరుస్తున్న విపక్షాలు..! కేటాయింపులు లోపభూయిష్టమన్న పార్టీలు..!!
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై విపక్షాలు పెదవివిరిచాయి. కనీస అవగాహన లేకుండా బడ్జెట్ను రూపొందించారని విమర్శించాయి. పలు అంశాల్లో సమతుల్యం పాటించలేదని మండిపడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగాలపై ప్రకటన లేకపోవడంతో నిరుద్యోగులకు బడ్జెట్ నిరుత్సాహం కలిగించిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ, జనసేన, బీజేపి పార్టీలు జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తమ అభిప్రాయాలను వెల్లడించాయి.
సీఎం మాటలకు..! చేతలకు పొంతన లేదు.. ఘాటుగా విమర్శిస్తున్న టీడిపి..!!
ఈ బడ్జెట్ చూస్తుంటే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందనేది ఎక్కడా కనిపించడం లేదు. దీనిపై ముఖ్యమంత్రికి, ఆర్థిక మంత్రికి కనీస అవగాహన కూడా లేదు. తెదేపా ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదని చెప్పిన ముఖ్యమంత్రి.. ఈ బడ్జెట్లో సున్నా వడ్డీ కోసం కేవలం వంద కోట్లు మాత్రమే కేటాయించడం విడ్డూరం. ఈ ఒక్క విషయంతోనే ముఖ్యమంత్రి మాట్లాడే మాటలకు చేసే పనులకు సంబంధం లేదని రుజువైందని టీడిపి సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు.
మద్యపాన నిషేధమన్నారు..! మార్గదర్శకాలు విడుదల చేయాలంటున్న కాంగ్రెస్..!!
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నవరత్నాలు నాణ్యత కోల్పోయాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విశ్వసనీయత కోల్పోయారు. నవరత్నాలలో కొన్నింటికి అసలు కేటాయింపులే లేవు. ప్రభుత్వ ఉద్యోగాలపై ప్రకటన లేక బడ్జెట్ నిరుద్యోగులకు నిరుత్సాహం కలిగించింది. జలయజ్ఞానికి గతం కంటే తక్కువ కేటాయించారు. ఆరోగ్యశ్రీకి నిధులు అరకొరగా కేటాయించారు. అమ్మ ఒడి పై స్పష్టత లేదు. మద్యపాన నిషేధం అమలు అంటూనే మద్యంపై ఆదాయం ఎక్కువ చూపారు. ఈ బడ్జెట్ పిట్టల దొర, కోతల రాయుడు బడ్జెట్లా ఉందని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసీరెడ్డి మండిపడ్డారు.
సమతుల్యం పాటించలేదు..! మండి పడ్డ జనసేన..!!
అభివృద్ధి, సంక్షేమ పథకాల సమతుల్యంలో ప్రభుత్వం విఫలమైంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన నిధులను ఏ విధంగా తీసుకువస్తారో వైకాపా ప్రభుత్వం స్పష్టతనివ్వాలి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి శ్వేత పత్రం విడుదల చేయాలని మా పార్టీ డిమాండ్ చేస్తోంది. మిగిలిన నీటిపారుదల ప్రాజెక్టు కోసం ఈ బడ్జెట్లో అరకొర నిధులే కేటాయించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఉండాలి. అదే సమయంలో ఆర్థికాభివృద్ధి జరగాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యం పాటించినప్పుడే ఆర్థిక ప్రగతిని సాధించగలం. అప్పుడే రాష్ట్రం ముందుకెళ్లడానికి అవకాశం ఉంటుందని జనసేన పార్టీ నేత చింతాల పార్థసారథి చెప్పుకొచ్చారు.