చంద్రబాబు పై ప్రతిపక్షం ముప్పేట దాడి..! త్వరలో మాజీ కావటం తథ్యమంటోన్న వైసీపి..!!
విజయవాడ/హైదరాబాద్ : ఏపి ప్రభుత్వంతో పాటు చంద్రబాబు పై ప్రతిపక్ష పార్టీ పక్కా మైండ్ గేమ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. వైసీపి కి చెందిన ప్రముఖ నేతలందరూ చంద్రబాబు ఖచ్చితంగా ఓడిపోతారని నిర్ధారిస్తున్నారు. ఓటమి బాధతో చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, టెక్నాలజీని అపహాస్యం చేస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు.
ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా పోలింగ్ శాతం పెరిగిందన్నారు. చంద్రబాబు ఎన్నికల కమిషన్ బెదిరించడం, సివిల్ సర్వీస్ ఆఫీసర్ విధులను తప్పపట్టడం సరికాదన్నారు. ప్రజలు బాబును తిరస్కరించనున్నారని, ఓటమి భయంతో అరాచకం సృష్టించాలని బాబు ప్రయత్నించారని రాంబాబు ఎద్దేవా చేసారు.
స్పీకర్ కోడెల నేరస్వభావం కలిగిన వ్యక్తి అని, ఇడిమొట్ల పోలింగ్ స్టేషన్లో రిగ్గింగ్ చేయటానికి ప్రయత్నించినందుకే ప్రజలు ఆయనపై తిరగబడ్డారని మండిపడ్డారు.. ఎన్నికల ముందు పసుపు కుంకమ అంటారు తర్వాత కారం కొట్టే విషయం మహిళలకు తెలుసు అన్నారు.
బాబు రాక్షస పరిపాలన అంతమొందించడానికే మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొన్నారని జోష్యం చెప్పారు. 2014 ఎన్నికలలో ఈవీయం మిషన్లతోనే చంద్రబాబు విజయం సాధించారు. ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలనకు ప్రజలు అదిరిపోయే తీర్పు ఇవ్వబోతున్నారని, మే 23 తర్వాత బాబు మాజీ కావటం తథ్యం అని రాంబాబు స్పష్టం చేశారు.