జగన్ కు భయం:చంద్రబాబు;ఈ గడ్డపై పుడితే అలా చేయండి:బిజెపి ఎమ్మెల్యేకు సవాల్
అమరావతి: కేంద్రాన్ని చూస్తే ప్రతిపక్ష నేత జగన్కు భయడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎద్దేవాచేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసిపి అధినేత జగన్ తో పాటు కేంద్రంపై, బిజెపి నేతలపై సిఎం చంద్రబాబు విమర్శల వర్షం కురిపించారు.
ఏపీలో తమిళనాడు అన్నాడీఎంకే బహిషృత నేత శశికళ ఎపిసోడ్ రిపీట్ అవుతుందని భయపడి జగన్ కేంద్రానికి లొంగిపోయాడని చంద్రబాబు ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ ఆంధ్రుడైతే, తెలుగు గడ్డ మీద పుడితే ప్రత్యేక హోదాపై తాను పెట్టిన తీర్మానాన్ని సమర్థించాలని చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. ప్రత్యేక హోదా ఇవ్వొద్దని ఎవరు చెప్పారో చూపించాలని చంద్రబాబు ఛాలెంజ్ చేశారు.
బుధవారం ఎపి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడు జగన్ పై విమర్శల వర్షం కురిపించారు. ప్రధాని మోడీని చూస్తే జగన్కు భయమన్నారు. రాష్ట్రం నష్టపోయినప్పుడు కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత వైసీపీకి లేదా?...అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రమంతటా జగన్ తిరుగుతున్నారని, ఏ ఒక్క ఊర్లో అయినా ఆయన బాధ్యతగా మాట్లాడారా?...కేంద్రాన్ని విమర్శించారా?...అని చంద్రబాబు నిలదీశారు.
అంటే దీన్నిబట్టి మోడీని చూస్తే జగన్కు భయమని అర్థంచేసుకోవాలన్నారు. మోడీ అదే విధంగా అలాగే మమ్మల్ని కూడా బెదిరించాలని అనుకున్నారని, ఇది మంచిది కాదన్నారు. అధికారం, రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చాలా మందిని చూశానని అన్నారు. రాజకీయనేతలు ఎవరైనా ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని...రాజ్యాంగ పరిధిలో పనిచేస్తూ న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడాలని హితవు పలికారు.
అనంతరం విభజన చట్టం అమలు, ప్రత్యేక హోదా విషయమై కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై బుధవారం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన సందర్బంగా బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు సీఎం చంద్రబాబు ఒక సవాల్ విసిరారు. తీర్మానాన్ని బలపరచడమే కాదు మీకు ధైర్యం ఉంటే...ఈ గడ్డపై పుట్టి ఉంటే కేంద్రాన్ని నిలదీయాలని ఛాలెంజ్ చేశారు. అలాచేస్తే ఐదు కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని అభినందిస్తారని అన్నారు.
తాను చేసే పోరాటం స్వార్థం కోసం చేసేది కాదని, రాష్ట్ర ప్రజల హక్కుల కోసమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ పోరాటాన్ని స్వాగతించాలని, సహకరించాలని.. అప్పుడే కేంద్రం దిగివస్తుందని సీఎం అన్నారు. తనకు ఎవరిపైనా కోపం, బాధ లేదని, కానీ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.