ప్రమాదంలో దేశం, కాంగ్రెస్తోను విభేదాలు, మోడీ కంటే గొప్పగా చేస్తారు: రాహుల్కు చంద్రబాబు ప్రశంస
న్యూఢిల్లీ: తాను ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఇతర జాతీయ నాయకులు శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, అజిత్ సింగ్ తదితరులను కలిశానని ఆంధ్రప్రదేశ్ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం చెప్పారు. ఆయన న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ పర్యటన గురించి చెప్పారు.
మోడీ వార్నింగ్ ఇచ్చారు, అందుకే రేపు రాహుల్ గాంధీని కలుస్తున్నా: చంద్రబాబు ఊహించని ప్రకటన!
జాతీయ పార్టీల నాయకులను అందరినీ కలవాలని అనుకుంటున్నానని చెప్పారు. దేశ ఐక్యత కోసం కృషి చేస్తామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ఆరోపించారు. ఇప్పుడు జీఎస్టీ దుష్పరిణామాలను అనుభవిస్తున్నామని చెప్పారు. చరిత్రలో మొదటిసారి ఆర్బీఐలో సెక్షన్ 7 అమలు చేస్తున్నారన్నారు. మోడీ కంటే ఏ నాయకుడైనా గొప్పగా పని చేస్తారని చెప్పారు.
వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయి
జీఎస్టీ అమలులో ఇంకా లోపాలు ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. మోడీ హయాంలో నిరుద్యోగం, ద్రవ్యోల్భణం పెరిగిందని చెప్పారు. బీజేపీ హయాంలో దేశంలోని వ్యవస్థలు అన్నీ నాశనం అయ్యాయని చెప్పారు. రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసి రూ.2000 నోట్లు తీసుకు వచ్చారని దుమ్మెత్తిపోశారు. ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలు పెరిగాయన్నారు. బీజేపీ పాలనలో అందరూ బాధపడుతున్నారన్నారు.
Recommended Video
ప్రశ్నించిన వారిపై ఐటీ దాడులు
దేశంలో లౌకికవాదం ప్రమాదంలో పడిందని చంద్రబాబు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని పరిస్థితులు ఇప్పుడు దేశంలో ఉన్నాయని చెప్పారు. బీజేపీ వ్యతిరేక పక్షాలన్నింటిని కలుస్తున్నానని చెప్పారు. ప్రశ్నించిన వారిపై ఐటీ దాడులు చేయిస్తున్నారన్నారు. మా ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లు, సంస్థలపై ఐటీ, ఈడీ దాడులు జరిగాయన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ.. ఇలా అన్ని సంస్థలను నాశనం చేశారన్నారు. బీజేపీ హయాంలో వ్యవస్థలన్నీ నాశనం అవుతున్నాయన్నారు. బీజేపీ వైఖరి వల్ల ఆర్బీఐ గవర్నర్ తప్పుకునే పరిస్థితి వచ్చిందన్నారు.
అన్నీ గుజరాతీయులకే, హోదా అడిగితే ఐటీ దాడులు చేస్తారా?
అన్ని విభాగాల ఉన్నతాధికారుల పదవులు గుజరాతీయులకే దక్కుతున్నాయని చంద్రబాబు చెప్పారు. ఐక్యతా విగ్రహం ఆవశ్యకత ఏమిటని ప్రశ్నించారు. మోడీ హయాంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని చెప్పారు. విపక్షాలపై ఐటీ దాడులతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా అడిగినందుకు ఐటీ దాడులు చేయిస్తారా అని నిలదీశారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చమని తాము అడిగామన్నారు.
నేషనల్ మీడియా నా ప్రెస్ మీట్ కవర్ చేయలేదు
కిందటిసారి తాను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేషనల్ మీడియా కవర్ చేయలేదని చంద్రబాబు చెప్పారు. మీడియాను నియంత్రించాలని చూస్తున్నారని మండిపడ్డారు. బోపోర్స్ లేని రహస్యం రాఫెల్కు ఎందుకు అని ప్రశ్నించారు. రాఫెల్ స్కాంపై ప్రధాని మోడీ మౌనానికి అర్థం ఏమిటని ప్రశ్నించారు. రాఫెల్ పోరాటాన్ని రాహుల్ గాంధీ ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారని ప్రశంసించారు. దేశాన్ని రక్షించాలని అనుకునే వారు తమతో కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. త్వరలో అన్ని పార్టీల నేతలతో సమావేశమవుతామని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీతోను మాకు విభేదాలు
ప్రజలను కుల, మతాల ఆధారంగా విభజించి బీజేపీ పాలించే ప్రయత్నాలు చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. తమకు కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీతోను విభేదాలు ఉన్నాయని చెప్పారు. దేశ ప్రయోజనాల కంటే తెలుగుదేశం పార్టీకి ఏదీ ముఖ్యం కాదని చెప్పారు. దేశాన్ని రక్షించాలని భావిస్తున్న పార్టీలతో కలిసి వెళ్తామని చెప్పారు. మోడీ ప్రభుత్వం కారణంగా జనం కష్టపడ్డారే తప్ప ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. నోట్ల రద్దు కష్టాలు నోటికీ తీరలేదన్నారు. మోడీ సర్కార్ తీరుతో జనం విసుగెత్తిపోయారన్నారు.
దేశం ప్రమాదంలో ఉంది, కాలపరిమితి లేదు
దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్నదే లక్ష్యంగా పార్టీలన్నీ ఏకమవుతున్నాయని చంద్రబాబు చెప్పారు. దీనికి ఎలాంటి కాలపరిమితి లేదని చెప్పారు. దేశం ఇప్పుడు ప్రమాదంలో ఉందని చెప్పారు. ఇప్పుడు దేశంలో ఐక్యత సాధించడం తమ ముందు ఉన్న లక్ష్యమని చెప్పారు. పదవుల మీద ఆశతో తాము ఈ పోరాటం చేయడం లేదని చెప్పారు. ఇప్పటికే కొంతమందితో చర్చించామని, మరికొందరితో చర్చించాలన్నారు. రాహుల్ గాంధీతో చర్చలు ఫలప్రదంగా సాగాయన్నారు. అవసరమైన ప్రతిసారి దేశ రాజకీయాల్లో టీడీపీ కీలక పాత్ర పోషించిందని చెప్పారు.