చంద్రబాబు దీక్ష:పూజలు ఒకవైపు...ఆరోపణలు మరోవైపు
విజయవాడ: ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేయనున్న ధర్మ పోరాట దీక్ష విజయంతం కావాలని కోరుతూ ఇంద్రకీలాద్రిపై టిడిపి మహిళ నాయకురాలు ముళ్లపూడి రేణుక సారధ్యంలో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. మనకోసం పేరుతో కొండపైకి వెళ్లిన మహిళలకు ఈవో పద్మ, పాలకమండలి ఛైర్మన్ సాగర స్వాగతం పలికారు.
మరోవైపు చంద్రబాబు ఈ నెల 20 న చేయనున్న దీక్షకు పెద్దఎత్తున ప్రజలను తరలించేందుకు అధికార దుర్వినియోగం జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు చేస్తున్న ఈ దీక్షకు విద్యార్థులు, డ్వాక్రా మహిళలను తరలించేందుకు ఏర్పాట్లు జరిగాయని,ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలలకు చెందిన విద్యార్థులు విధిగా ఈ దీక్ష వద్దకు రావాలంటూ మెసేజ్లు కూడా పెడుతున్నారని విపక్షాలు ఆరోపించడంతో పాటు అందుకు ఇవే ఆధారాలంటూ ఆ మెసేజ్ లు చూపిస్తున్నాయి.
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు చేయబోయే దీక్షకు సంఘీభావం తెలుపుతూ ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు నిర్వహించిన టిడిపి నేత ముళ్లపూడి రేణుక ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు చంద్రబాబుకు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. చంద్రబాబు దీక్షకు తనతో పాటు మహిళలు అందరు సంఘీభావం ప్రకటించారని, రాష్ట్రాభివృద్ధి కోసం కష్టపడుతున్న చంద్రబాబుకు మరింత శక్తిని ప్రసాదించాలని అమ్మవారిని కోరినట్లు ఆమె చెప్పారు.
మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం అధికారికంగా చేపడుతున్న ధర్మ పోరాట దీక్షకు పెద్దఎత్తున ప్రజలను తరలించేందుకు అధికార దుర్వినియోగం జరుగుతోందని విపక్షాల నేతలు ఆరోపిస్తున్నారు. విద్యార్థులను తప్పనిసరిగా తీసుకురావాలంటూ కాలేజ్ లకు నోటీసులు పంపించారని, డ్వాక్రా మహిళలను తరలించేందుకు యానిమేటర్లకు ఆదేశాలిచ్చారని ఆరోపిస్తున్నారు. అలాగే గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి మహిళల తరలింపు బాధ్యతలను ఏకంగా తహశీల్దార్లకే అప్పగించారని విమర్శిస్తున్నారు.
దీక్షా శిబిరం వద్ద మూడువేల మంది కూర్చునే విధంగా సీటింగు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చేవారు ఇబ్బందులు పడకుండా మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు చేస్తున్నారు. రవాణా సదుపాయాలు కల్పించాల్సిందిగా కృష్ణా జిల్లా రవాణాశాఖకు బాధ్యతలు అప్పగించారు. తరలించేవారికి కావాల్సిన సదుపాయాలన్నీ తహశీల్దార్లే చూసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. దీనికి మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని, ప్రతిపక్షాల నోరు మూయించే విధంగా దీక్షలు విజయవంతం కావాలని ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు జారీచేసినట్లు విపక్షాల నేతలు ఆరోపిస్తున్నారు. అందుకు అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వ పరంగానే వెచ్చించనున్నారని, ఇది సరికాదని విమర్శిస్తున్నారు.