చెప్పగలవా.. పవన్ కళ్యాణ్ను అడుగుతున్నా: చిరంజీవిని లాగిన టీడీపీ నేత
అమరావతి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన దళిత తేజం సభను చూసిన ప్రతిపక్షాల వెన్నులో వణుకు పుట్టిందని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య ఆదివారం విమర్శలు గుప్పించారు. దళితుల కోసం టీడీపీ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా దళితుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
దళితుల అభ్యున్నతి కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. దళిత బిడ్డలకు ఆర్థిక సాయం చేసి విదేశాలలో చదివిస్తున్న ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అన్నారు. అసలు మీరు ఎప్పుడైనా ఇచ్చారా అని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. మీ నాన్న ఇచ్చారా అని వైసీపీ అధినేత జగన్ను ప్రశ్నించారు.
నువ్వు, మీ తండ్రి ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఇచ్చిందా చెప్పాలన్నారు. పవన్ కళ్యాణ్ను కూడా అడుగుతున్నానంటూ ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ గతంలో కాంగ్రెస్ పార్టీ నేతల పంచెలు ఊడదీసి కొడతానని చెప్పారని, కానీ వారి అన్నయ్య చిరంజీవి తన పార్టీని (ప్రజారాజ్యం) కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారని, ఆ కాంగ్రెస్ పార్టీలో మెగాస్టార్ కేంద్రమంత్రిగా ఉన్నారని, అలాంటి మీ అన్నయ్య నీకు (పవన్ కళ్యాణ్) రాజకీయ గురువు అని చెబుతున్నావని, మరి అలాంటి నువ్వు దళితులకు వారేం చేశారో చెబుతావా అని జనసేనానిని ప్రశ్నించారు. దళిత వాడల్లోకి వెళ్లి ఓటు అడిగే హక్కు కేవలం టీడీపీకే ఉందన్నారు. ప్రతిపక్షాలకు దళితుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.