సాయంత్రం మరోసారి హస్తినకు చంద్రబాబు?
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ యాత్ర చేపట్టబోతున్నారు. గురువారం సాయంత్రం ఆయన హస్తినకు బయలుదేరి వెళ్లనున్నారు. దేశవ్యాప్తంగా 21 ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఆయన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలుసుకోనున్నట్లు తెలుస్తోంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీకి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని ఇవ్వకూడదని ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతిని కోరనున్నట్లు సమాచారం.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనన్ని మెజారిటీ స్థానాలు దక్కితే తప్ప- ఏ కూటమికి గానీ, పార్టీకి గానీ అవకాశం ఇవ్వకూడదని ప్రతిపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేస్తారని తెలుస్తోంది. దీనితో పాటు- ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ట్యాంపరింగ్కు గురయ్యాయని, వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఇప్పటికే పలుమార్లు విమర్శలు గుప్పించిన ప్రతిపక్షాలు.. ఇదే విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తారని చెబుతున్నారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో తొందరపడ వద్దని, గడువు ఇవ్వాలని ఆయా పార్టీల నేతలు రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. కూటమిలో ఒక పార్టీకి లభించిన సీట్ల సంఖ్య ఆధారంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించడం సరికాదని ప్రతిపక్ష పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. కూటమిలో ఉన్న అన్ని పార్టీలు సాధించిన స్థానాల సంఖ్య, వాటి బలాబలాలను పరిశీలించిన తరువాతే నిర్ణయం తీసుకోవాలని వారు రాష్ట్రపతిని కోరవచ్చని సమాచారం.