వైఎస్ జగన్, కేసీఆర్లకు ప్రతిపక్షం గాలం! వాళ్లొస్తే..చంద్రబాబు పరిస్థితేంటీ?
Recommended Video
అమరావతి: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు 24 గంటలు కూడా లేదు. ఈ రాత్రి గడిస్తే- ఫలితాలు వెలువడుతాయి. రాజు ఎవరో..బంటు ఎవరో తేలిపోతుంది. దేశ ప్రజలు ఎవర్ని అందలం ఎక్కించారు? ఎవర్ని అధఃపాతాళానికి తొక్కేశారో తెలియడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ పరిస్థితుల్లో దేశ రాజధానిలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి.
దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలపై కన్నేశాయి. ఎన్నికలకు ముందు ఎవ్వరితోనో పొత్తు లేకుండా, సీట్లను సర్దుబాటు చేసుకోకుండా- ఒంటరిపోరుకు దిగిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై చూపులు సారించాయి.
ఈ రెండు పార్టీలు అసాధారణ మెజారిటీ సాధించగలవంటూ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఆ ఇద్దరు నేతలను కలుపుకొని వెళ్లడానికి ప్రతిపక్ష పార్టీలు అందుబాటులో ఉన్న అన్ని వనరులనూ ఉపయోగిస్తున్నాయి. ప్రయోగిస్తున్నాయి. ఇందులో భాగంగా- ఇదివరకే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సుప్రిమో శరద్ పవార్ బరిలో దిగారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని సంప్రదించడానికి ప్రయత్నించారు. ఫోన్ ద్వారా సంభాషించడానికి శరద్ పవార్ చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.
ఏపీలో వైసీపీకి 43 శాతం..టీడీపీకి 38 శాతం ఓట్ షేరింగ్ : హిందూ- సీఎస్డిఎస్-లోక్నీతి సర్వే..!
ఓట్ల లెక్కింపు సమీపించిన తరుణంలో- ప్రతిపక్ష పార్టీలు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశాయి. ఫోన్ ద్వారా పనులు కావని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ.. ఏకంగా ఒకరిద్దరు సీనయర్లను వారివద్దకు పంపించబోతున్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్, కేసీఆర్లతో రాయబారం చేసేదెవరనేది ఇంకా తెలియరాలేదు.
ప్రస్తుతం 21 ప్రతిపక్ష పార్టీల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యాంకర్ పాత్ర పోషిస్తున్నారు. ప్రతిపక్షాలను ఏకతాటిపై తీసుకుని రావడానికి ఆయన చక్కర్లు కొడుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే 21 ప్రతిపక్ష పార్టీలకు మౌత్ పీస్గా మారిపోయారు చంద్రబాబు. ప్రతిపక్ష పార్టీల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ గానీ, వైఎస్ జగన్ గానీ ప్రతిపక్షాల కూటమిలో చేరుతారా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
కేసీఆర్, వైఎస్ జగన్లతో చంద్రబాబుకు ఉన్న శతృత్వం వేరు. రాజకీయాలతో సంబంధం లేని వైరం అది. ఓటుకు నోటు కేసు కావచ్చు, నీటి పంపకాల వ్యవహారం కావచ్చు..కారణాలేమైనప్పటికీ.. ఇద్దరు చంద్రుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంతలా మనస్పర్థలు పుట్టుకొచ్చాయి. అవి మరింత ప్రజ్వరిల్లుతున్నాయే తప్ప తగ్గిన దాఖలాలు లేవు. ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు వైఎస్ జగన్, కేసీఆర్లపై ఎంతగా చెలరేగిపోయారో జనం ఇప్పట్లో మరిచి పోలేరు కూడా. చంద్రబాబు ఆ ఇద్దరు నేతలపై వ్యక్తిగతంగా విమర్శల దాడికి దిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
ఏపీలో- ఈ అయిదేళ్ల పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీ. కేసీఆర్నైనా కలుపుకొని పోవడానికి చంద్రబాబు సిద్ధ పడతారేమో గానీ.. జగన్ విషయంలో అది అసాధ్యం. వైఎస్ జగన్ కూడా చంద్రబాబు కీలకంగా వ్యవహరిస్తోన్న 21 ప్రతిపక్షాల కూటమితో జట్టు కట్టడానికి అంగీకరిస్తారని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది.
ఇదిలావుండగా- ప్రతిపక్షాలకు కావాల్సింది సీట్లు. ఇందులో మరో మాటకు అవకాశమే లేదు. వ్యక్తుల గురించి అస్సలు పట్టించుకోదు. ఏపీ, తెలంగాణల్లో మొత్తం కలిపి 42 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇందులో మెజారిటీ సీట్లు వైఎస్ఆర్ సీపీ, టీఆర్ఎస్ తమ ఖాతాలో వేసుకోవడం ఖాయమంటూ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఎంత తక్కువగా అనుకున్నా - కనీసం 30 సీట్లను ఈ రెండు పార్టీలు గెలుచుకోవచ్చు. అదే జరిగితే- ఇప్పుడున్న పరిస్థితుల్లో 30 సీట్లు అంటే ప్రతిపక్షాలకు చాలా ఎక్కువ. హంగ్ అంటూ ఏర్పడితే- తటస్థంగా ఉంటూ వచ్చిన వైఎస్ జగన్, కేసీఆర్లకు ఉండే డిమాండే వేరు. ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా బట్టి చూస్తే.. తెలుగుదేశం పార్టీ అయిదు నుంచి ఏడు లోక్సభ స్థానాలకే పరిమతం కావచ్చు.
సాధారణంగా- ఏ కూటమైనా సరే! అధిక సీట్లను సాధించుకునే పార్టీల వైపే చూపులు సారిస్తాయి. ఇప్పుడు అదే పరిస్థితి హస్తినలో నెలకొని ఉంది. ఎలాగైనా- వారిద్దరినీ తమ కూటమిలోకి చేర్చుకోవడానికి కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలను చేస్తోంది. తమ డిమాండ్లకు కాంగ్రెస్ తల ఊపితే.. కేసీఆర్ లేదా వైఎస్ జగన్ ఆ పార్టీకి మద్దతు ఇవ్వడానికి వెనుకాడరు. ఎందుకంటే- రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ఏ పార్టీనైనా తాము మద్దతు ఇస్తామని వైఎస్ జగన్ మొదటి నుంచీ చెబుతూ వస్తున్నారు. హోదా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తే.. జగన్ మద్దతు ఇవ్వడం కూడా ఖాయమే అవుతుంది. వారిద్దరూ కాంగ్రెస్తో జట్టు కడితే- చంద్రబాబు పరిస్థితేమిటదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.