ఏపీ కరోనా క్వారంటైన్లో ఘోరం.. ఏప్రిల్ జీతాలూ కష్టమేనంటూ..
ఎంపీలో కరోనాను అడ్డం పెట్టుకుని గట్టెక్కాలనుకున్న కమల్ నాథ్ ప్రయత్నాలు అడ్డంగా ఫెయిలయ్యాయి. ఏపీలో మాత్రం కరోనాపై రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. వైరస్ వ్యాప్తి తర్వాత అధికార, ప్రతిపక్ష పార్టీల పరస్పర విమర్శల్లో మహమ్మారికి పెద్ద పీట దక్కుతోంది. స్థానిక ఎన్నికల రద్దు నుంచి ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూను కూడా విమర్శనాస్త్రంగా మలుచుకున్న టీడీపీ.. వైసీపీపై దాడి ముమ్మరం చేసింది. ఏప్రిల్ నెలలో జీతాల చెల్లింపులపైనా అనూహ్య వ్యాఖ్యలు చేసింది.
ఏపీలో కరోనా సీన్ ఇది..
పొరుగు రాష్ట్రం తెలంగాణతో పోల్చుకుంటే.. ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు, అనుమానితుల సంఖ్య తక్కువగానే ఉంది. ఆరోగ్య శాఖ అధికారుల వివరణ ప్రకారం.. శుక్రవారం నాటికి ఏపీలో మూడు పాజిటివ్ కేసులు ఉండగా, మొత్తం 1,006 మంది అనుమానితులకు టెస్టులు నిర్వహించామని, 28 రోజుల క్వారంటైన్ తర్వాత 259 మందిని ఇళ్లకు పంపేశామని, మరో 711 మంది తమ సొంత ఇళ్లలోనే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారని అధికారులు చెప్పారు. ఇక కొద్దిగా క్రిటికల్ అనుకున్న 36 మంది పేషెంట్లు వివిధ ఆసుపత్రుల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఇప్పటిదాకా135 మంది అనుమానితుల శాంపిల్స్ను పరీక్షలకు పంపగా, 108 మందికి నెగటివ్ వచ్చిందని, ముగ్గురికి మాత్రమే పాజిటివ్ అని తేలిందని, మరో 24 మందికి చెందిన రిపోర్టులు రావాల్సి ఉందని ఆఫీసర్లు తెలిపారు.
క్వారంటైన్లో ఏం పెడుతున్నారు?
ప్రభుత్వ ఆధ్వర్యంలోని క్వారంటైన్ కేంద్రాల్లో అనుమానిత కరోనా రోగులకు పెడుతోన్న భోజనం చాలా ఘోరంగా ఉందని ప్రతిపక్ష టీడీపీ మండిపడింది. కేరళలో అక్కడి ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్లలో అందిస్తోన్న భోజనాన్ని, ఏపీలో జగన్ సర్కారు పెడుతోన్న భోజనాన్ని కంపేర్ చేస్తూ టీడీపీ విమర్శలకు దిగింది. ‘‘కరోనా కారణంగా ఎన్నికలు ఆగాయన్న కోపం వైసీపీలో స్పష్టంగా కనిపిస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వాళ్లను విశాఖపట్నంలోని క్వారంటైన్ సెంట్లలో ఉంచిన వాళ్లకు పెడుతోన్న భోజనం ఘోరంగా ఉందని ఆరోపించింది. ఇక ఆదివారం నాటి జనతా కర్ఫ్యూపైనా అవేర్నెస్ పేరుతో టడీపీ ఆందోళన రేకెత్తించింది.
జనతా కర్ఫ్యూపై టీడీపీ మెలిక..
ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆదివారం జనమంతా జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు పిలుపునివ్వగా.. సాయంత్రం పార్టీ అధికారిక ట్విటర్ ఖాతాలో మాత్రం కొన్ని మెలికలు కనిపించాయి. నిత్యావసరాల విషయంలో ప్రజలు గాభరా పడొద్దన్న మోదీ సూచనకు విరుద్ధంగా టీడీపీ.. ‘‘రెండ్రోజులకు సరిపడా సరుకుల్ని ముందే తెచ్చిపెట్టుకోండి..''అని సలహా ఇచ్చింది. జనతా కర్ఫ్యూ కారణంగా దుకాణాలు, రవాణా అన్నీబంద్ అవుతాయని, జనం ఏ ఒక్క అవసరానికైనా బయటికి వెళ్లకుండా ఉనప్పుడే కర్ఫ్యూ ప్రయోజనం నెరవేరుతుందని ప్రతిపక్ష పార్టీ పేర్కొంది.
జీతాలకు డబ్బులెలా?
ఆర్థిక సంవత్సరం చివరి వారంలోకి అడుగు పెట్టినా.. రాష్ట్ర బడ్జెట్ పై వైసీపీ ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వడంలేదని, ఈనెల 31లోగా అసెంబ్లీలో బడ్జెట్ పెట్టకుంటే, ఏప్రిల్ నెల జీతాలు చెల్లించేందుకు కూడా వీలుండదని ప్రతిపక్ష టీడీపీ హెచ్చరించింది. రాష్ట్రంలో కరోనా లేదంటూనే వేల మందిని క్వారంటైన్ చేస్తుండటాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘కరోనా వ్యాపించకముందే గృహ నిర్భంధాలు అమలు చేస్తే.. పేదలకు రేషన్, నగదు సహాయం మాటేంటి? ఆర్థిక మంత్రి బుగ్గనకు వీటికంటే ఎన్నికలే ప్రధానమయ్యాయా?''అని టీడీపీ ప్రశ్నించింది.