అసెంబ్లీకి హాజరవుతాం.!వైసీపి విధానాలను ప్రజలకు ఎత్తి చూపిస్తాం.!టీడీపీ సంచలన నిర్ణయం.!
అమరావతి/హైదరాబాద్ : మంగళవారం నుండి జరగబోవు శాసనసభ సమావేశాలకు హాజరు కావాలా వద్దా అనే సంధిగ్దానికి ఏపీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తెరదించింది. కేవలం రెండు రోజుల మాత్రమే జరగబోయే సమావేశాలుకు హాజరవ్వడంపై తటస్త వైఖరి చూపించిన టీడిపి చివరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఓపక్క టీడిపి ఎమ్మెల్యేల మీద కేసులు, మరోపక్క కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో సమావేశాలకు హాజరు కావాలా వద్దా అనుకున్న టీడిపి ఓ స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తోంది.
శాసన సభ సమావేశాలపై టీడీపీ కీలక నిర్ణయం.. ప్రభుత్వ విధానాలను ఎండగడతామంటున్న టీడిపి
ఇదిలా ఉండగా గతంలో శాసన సభ సమావేశాలను వైసీపి బహిష్కరించిందని, అప్పుడు ఆ పార్టీని అనేక విధాలుగా విమర్శించి, ఇప్పుడు సమావేశాలును బహిష్కరించడం అంత సమంజసం కాదని టీడిపి సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. శాసన సమావేశాలకు హాజరై ప్రభుత్వ విధానాలను ప్రజలకు చూపించాలని టీడిపి కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 16వ తేదీ నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. జూన్ 16, 17 తేదీలలో కేవలం రెండు రోజుల పాటే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి.
రెండు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. హాజరవుతామంటున్న టీడిపి ఎమ్మెల్యేలు..
ఇదిలా ఉండగా రాష్ట్రంలో నెలకొన్న లాక్డౌన్, కరోనా విజృంభణలకు రాజకీయ ప్రకంపనలు కూడా జత కావడంతో అసెంబ్లీ సమావేశాల విషయంలో తెలుగుదేశం పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. ఈ తరుణంలో ప్రతిపక్ష్ నేత చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సోమవారం సమావేశమైన టీడీఎల్పీ కీలక నిర్ణయం తీసుకుంది. రెండ్రోజుల పాటు జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని టీడీఎల్పీ నిర్ణయించింది. రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని ఆరోపించిన తెలుగుదేశం పార్టీ వాస్తవాలను శాసన సభ వేదికగా ప్రజలకు వివరించాలని నిర్ణయించారు.
మొదట్లో సమావేశాలను బహిష్కరించాలనుకున్న టీడిపి.. తర్వాత వ్యూహం మార్చిన చంద్రబాబు..
మొదట్లో కేవలం రెండు రోజులు మాత్రమే జరిగే అసెంబ్లీ సమావేశాలను ప్రతిపక్ష టీడిపి బహిష్కరించాలని భావిస్తున్నట్లుగా చర్చ తెరమీదకు వచ్చింది. అయితే సోమవారం సమావేశమైన తెలుగుదేశం పార్టీ నేతలు, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో అక్రమ అరెస్టులు, ఇసుక మాఫియా, మద్యం ధరలు, విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ప్రభుత్వాన్ని నిలదీయాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. తమ పార్టీ నేతల అరెస్టులపై గవర్నర్ను కలిసి వినతిపత్రం సమర్పించనున్నారు టీడీపీ నేతలు.
Recommended Video
ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తాం.. ప్రజలకు అన్ని విషయాలు వివరిస్తామంటున్న టీడిపి..
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపి, మధ్యాహ్నం సమావేశాల్లో వార్షిక బడ్జెట్ను సభలో ప్రవేశపెడతారు. ఆ వెంటనే బడ్జెట్పై స్వల్ప వ్యవధిలో చర్చను ముగించి, సభ ఆమోదం తీసుకుంటారు. తిరిగి మంగళవారం సమావేశమయ్యే సమావేశాల్లో కొన్ని కీలక బిల్లులను ఆమోదించిన తర్వాత నిరవధికంగా వాయిదా పడుతుంది. ఈ మేరకు వైసీపి ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. తాజాగా రెండ్రోజుల సభలో పలు కీలకాంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్ష టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఇక ప్రతిపక్షటీడిపి వ్యూహాలను సమర్దవంతంగా తిప్పికొట్టాలని అధికార పార్టీ ప్రతివ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.