ఆన్లైన్ నామినేషన్లకు విపక్షాల డిమాండ్... ఇప్పటికిప్పుడు సాధ్యమేనా... ఎస్ఈసీ అంగీకరిస్తారా...?
రాష్ట్ర ప్రభుత్వానికి,ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కు మధ్య కోర్టుల్లో నలుగుతూ వచ్చిన పంచాయతీ ఎన్నికలకు ఎట్టకేలకు మార్గం సుగమమవడంతో ఆ దిశగా ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. రేపటి నుంచే నామినేషన్ల పర్వం మొదలవుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలన్ని అభ్యర్థిత్వాలపై ఫోకస్ చేశాయి. అటు అధికార వైసీపీ పంచాయతీల ఏకగీవ్రంపై ఫోకస్ చేయడంతో ప్రతిపక్షాలు పలు ఆరోపణలు చేస్తున్నాయి.
అధికార బలంతో వైసీపీ శ్రేణులు విపక్షాల అభ్యర్థులను బెదిరింపులకు గురిచేసి పోటీ చేయకుండా అడ్డుపడుతున్నారని టీడీపీ,జనసేన,బీజేపీలు ఆరోపిస్తున్నాయి. విపక్ష అభ్యర్థుల నామినేషన్లకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలంటే ఆన్లైన్ నామినేషన్లకు అవకాశం కల్పించాలని విపక్ష పార్టీలు ఎస్ఈసీని డిమాండ్ చేస్తున్నాయి.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇదివరకే ఈ డిమాండ్ వినిపించారు. అధికార పార్టీ బలవంతపు ఏకగ్రీవాలతో విపక్ష అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అందరికీ కల్పించాలంటే ఆన్లైన్ నామినేషన్ల ప్రక్రియను చేపట్టాలన్నారు. తద్వారా అభ్యర్థులు ధైర్యంగా నామినేషన్లు వేసేందుకు ముందుకొచ్చే పరిస్థితి ఉంటుందన్నారు.
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకగ్రీవాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని ఇప్పటికే కలెక్టర్లను ఆదేశించారు. బలవంతపు ఏకగ్రీవాలు జరిగినట్లు తెలిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ చేపట్టాలని... ఏకగ్రీవాల సంఖ్య అపరిమితంగా పెరిగితే కచ్చితంగా జోక్యం చేసుకుంటామని అన్నారు. రేపటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుండటంతో ఇప్పటికిప్పుడు ఆన్లైన్ నామినేషన్లకు ఏర్పాట్లు చేయడం అసాధ్యమనే చెప్పాలి. కాబట్టి విపక్షాల డిమాండ్ నెరవేరే అవకాశం కనిపించట్లేదు.
కాగా,ఈసారి ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ప్రభుత్వం భారీ నజరానాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. 2 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో ఎన్నికలు ఏకగ్రీవమైతే ఆ పంచాయతీకి రూ.5 లక్షల వరకు నగదు ప్రోత్సాహం అందించనున్నారు. అలాగే 2001 నుంచి 5000 లోపు జనాభా ఉండే పంచాయతీలకు రూ.10లక్షలు,5001 నుంచి 10 వేల జనాభా వున్న పంచాయతీలకు రూ.15లక్షలు నజరానా అందించనున్నారు.