ఏపీకి ఒరాకిల్ సాయం: విశాఖలో మంత్రి గంటాకు చేదు అనుభవం
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పాలుపంచుకునేందుకు, తమవంతు సహకారాన్ని అందించేందుకు ప్రముఖ ఐటీ సంస్ధ ఒరాకిల్ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం ఒరాకిల్ కంపెనీ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖా మంత్రి శిద్ధా రాఘవరావుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ భేటీలో ఏపీలో కొత్త రహదారుల నిర్మాణానికి, పాత వాటికి సంబంధించిన మరమ్మత్తుల కోసం తాము రూపొందించిన సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తామని వారు వెల్లడించినట్టు సమాచారం. ఒరాకిల్ కంపెనీ ప్రతినిధులు చెప్పిన విషయాలను ఆసక్తిగా ఆలకించారు.
అనంతరం ఏపీ రాజధాని అమరావతి నుంచి రాష్ట్రంలోని అన్ని పట్టణాలను కలుపుతూ త్వరలో నిర్మించనున్న రహదారుల కోసం ఈ టెక్నాలజీని వాడుకుంటామన్నట్టు మంత్రి శిద్ధా రాఘవారవు చెప్పినట్లుగా తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, ఒరాకిల్ మధ్య త్వరలో ఎంఓయూ కుదరనుందని అధికారులు వెల్లడించారు.
విశాఖలో మంత్రి గంటాకు చేదు అనుభవం
విశాఖలో మంత్రి గంటా శ్రీనివాసరావుకు బుధవారం చేదు అనుభవం ఎదురైంది. విశాఖ పోర్టు ట్రస్టు వద్ద ఫెర్రీ బోట్ల ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆయనను మత్స్యకారులు అడ్డుకున్నారు. ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్) కోసం తాత్కాలికంగా ఏర్పాట్లకే అంగీకరించామని, ప్రభుత్వం ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా ఊరుకోబోమని వారు హెచ్చరించారు.
అయితే వారి సమస్యలను సావధానంగా విన్న మంత్రి ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఎలాంటి నిర్మాణాలు జరగకుండా చూస్తామని మంత్రి గంటా నచ్చజెప్పడంతో మత్స్యకారులు శాంతించారు. అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించకుండానే మంత్రి వెనుదిరిగారు.