సముద్రంపై చక్కర్లు: మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలను హడలెత్తించిన విమానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఓ విమానం హడలెత్తించింది. వివరాల్లోకి వెళితే..
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఓ విమానం హడలెత్తించింది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ నుంచి విశాఖ చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం వాతావరణం అనుకూలించక సుమారు 25 నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టింది.
తప్పిన ప్రమాదం: విశాఖ-హైదరాబాద్ విమానాన్ని ఢీకొన్న అడవిపంది, అసలేం జరిగిందంటే?
పొరపాటు గమనించి..
ఈ విమానం విజయవాడ నుంచి సాయంత్రం 6-15 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంది. అయితే పైలెట్ రన్వేపై దించాల్సిన ప్రదేశం కన్నా కాస్త ముందుకు వెళ్లాడు. వెంటనే గమనించి కిందకు దించకుండానే పైకి తీసుకెళ్లాడు.
అరగంటపాటు పైనే చక్కర్లు
కాగా, గాలులు అధికంగా వీయడం, వాతావరణం అనుకూలించక పోవడంతో సుమారు 25 నిమిషాలపాటు చక్కర్లు కొట్టింది. 6-40 గంటల సమయంలో విమానాన్ని సురక్షితంగా కిందకి దించాడు.
ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యేలు..
ఈ విమానంలో ఎంపీ సీఎం రమేష్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, మంత్రి కళా వెంకటరావు, ఎమ్మెల్యేలు గణబాబు, వాసుపల్లి గణేష్కుమార్, మృణాళిని, గౌతు శ్యాంసుందర్ తదితరులు ఉన్నారు.
హడలెత్తిపోయారు.. ఊపిరిపీల్చుకున్నారు
విమానం ల్యాండ్ అవకుండా సుమారు గంటన్నరపాటు విశాఖ, నగరంతోపాటు సముద్రంపై చక్కర్లు కొట్టడంతో తామంతా ఆందోళనకు గురయ్యామని విశాఖపట్నం పశ్చిమ ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు. విమానం సురక్షితంగా దిగడం(సుమారు సాయంత్రం 6.40గంటలకు)తో అంతా ఊపిరి పీల్చుకున్నట్లు తెలిపారు. ఎయిర్ఇండియా కూడా జరిగిన ఘటన వాస్తవమేనని వెల్లడించింది.