మా కేరాఫ్ అడ్రస్ మారింది...నీతిఆయోగ్కు ఏపీ ప్రభుత్వం లేఖ
అమరావతి:అవును...ఆంధ్రప్రదేశ్ సచివాలయం అడ్రస్ మారిందని తెలియజేస్తూ నీతి ఆయోగ్కు ఏపీ ప్రభుత్వం తాజాగా ఒక లేఖ రాసింది. కారణం ఇటీవల నీతి ఆయోగ్ ఎపి ప్రభుత్వానికి లేఖ పంపుతూ దానిపై టూ అడ్రస్ ను వెలగపూడి కేరాఫ్ ఏపీ క్యాపిటల్ హైదరాబాద్ అంటూ రాసి పంపడమే!
అయితే దీనిపై మీడియాలో వార్తలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు దాటుతోంది...పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని చట్టంలో ఉంది. అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనా సౌలభ్యం కోసమంటూ చాలా ముందుగానే హైదరాబాద్ను వదిలి వెలగపూడి సచివాలయంలో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు.
హైదరాబాద్ నుంచి...ఎప్పుడో వచ్చేశాం
అంతేకాదు ఎపికి సంబంధించిన దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలు నవ్యాంధ్ర రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలకు తరలించడం కూడా జరిగిపోయింది. ఈ క్రమంలో సుమారు రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్ పాలనంతా ఇక్కడి నుంచే సాగుతోంది. అయితే ఈ విషయాలన్నీ నీతి ఆయోగ్ కు తెలిసినట్లు లేదు. అందుకే ఎపి సిఎం అనగానే చట్ట ప్రకారం హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధాని కాబట్టి సిఎం అక్కడే ఉండి ఉండొచ్చని భావించి సిఎం చంద్రబాబుకు పంపాల్సిన ఒక లేఖను హైదరాబాద్ కు పంపింది.
Recommended Video
ఆ లేఖే...పెను దుమారం
వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానించాలన్న ప్రతిపాదనపై అధ్యయనానికి నీతి ఆయోగ్ ముఖ్యమంత్రులతో కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యునిగా ఏపీ సీఎం చంద్రబాబును ప్రధాని మోడీ నామినేట్ చేసినట్లు తెలుపుతూ నీతి ఆయోగ్ ఆ లేఖ రాసింది. అయితే ఈ లెటర్ పై ఎపి సిఎం టూ అడ్రస్ ఎపి సిఎం, వెలగపూడి కేరాఫ్ ఏపీ క్యాపిటల్ హైదరాబాద్ అని రాయడంపై తీవ్ర దుమారం రేగింది. దీనిపైన తెలుగు మీడియాలో ప్రత్యేక కథనాలు వచ్చాయి.
నీతి ఆయోగ్ ను...తప్పుబట్టలేం
అయితే ఆ విషయమై నీతి ఆయోగ్ ను ఎపి సర్కార్ తప్పు బట్టే అవకాశం లేకుండా పోయింది. కారణం ఇలా తమ అడ్రస్ మారిన విషయాన్ని ఎపి ప్రభుత్వం నీతి ఆయోగ్ కు తెలియచేయలేదు కాబట్టి...అదేమంటే చట్టంలో ఉమ్మడి రాజధాని పదేళ్లు కాబట్టి మీరు అక్కడ నుంచే పరిపాలన చేస్తున్నారనుకున్నాం అని నీతి ఆయోగ్ సిబ్బంది సమర్థించుకునే అవకాశం ఉంది...మరైతే వెలగపూడి అని ఎలా తెలిసిందని అడిగినా ప్రయోజనమేమీ ఉండదు.
మరోసారి...జరగకుండా
అందుకే మరోసారి ఇలాంటి తప్పులు జరిగే అవకాశం లేకుండా ఎపి ప్రభుత్వం కేంద్రంలోని మొత్తం 70శాఖలకు లేఖలు రాసింది. తమ సచివాలయం అడ్రస్ మారిందంటూ తెలియజేసింది. మరోసారి ఇలాంటిది జరిగితే అప్పుడు ఆ విషయమై ఆయా సంస్థలను, విభాగాలను నిలదీసే అవకాశం ఉంటుందన్న ఉద్దేశ్యంతో ఎపి ప్రభుత్వం ఆగమేఘాల మీద ఈ ప్రక్రియను పూర్తి చేసింది.